"గంటా-అయ్యన్న మధ్య మ్యాచ్ ఫిక్సింగ్?.. బాబే విష్ణుకుమార్ రాజు నోరు మూయించారు"
తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్దం అంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి గంటా కూడా సైలెంట్ అయ్యారని మండిపడ్డారు.
విజయవాడ: చూస్తుంటే విశాఖ భూకుంభకోణం వ్యవహారం కూడా తెరమరుగయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలంతా దీనిపై వ్యూహాత్మక మౌనం వహిస్తుండటంతో.. కుంభకోణంపై మాట్లాడటానికి అటు వైసీపీకి అవకాశం లేకుండా పోతోంది. ప్రత్యర్థి నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా టీడీపీ నేతలు దీనిపై నోరు మెదిపేలా కనిపించడం లేదు.
తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి స్పందించారు. కుంభకోణంపై తొలుత దూకుడు ప్రదర్శించిన మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పుడు సైలెంట్ అయిపోయారని విమర్శించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు-అయ్యన్నపాత్రుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగిందని, అందువల్లే అయ్యన్న నోరు మెదపడం లేదని ఆరోపించారు.
తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్దం అంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి గంటా కూడా సైలెంట్ అయ్యారని మండిపడ్డారు. భూఆక్రమణలు నిరూపిస్తామంటూ మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా మౌనం వహిస్తున్నారని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి సహాయంతో ఆయన నోటికి చంద్రబాబు తాళం వేశారని రోజా విమర్శించారు.