వైయస్ రాజశేఖర రెడ్డి వేసిందే: చంద్రబాబు దుమ్ముదులిపిన రోజా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎమ్మెల్యే రోజా ఆదివారం మరోసారి నిప్పులు చెరిగారు. నేను వేసిన రోడ్లపై నడుస్తూ నాకు ఓటు వేయాలని, ఓటుకు రూ.5వేలు ఇవ్వగలను కానీ ఇవ్వనని సీఎం అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎమ్మెల్యే రోజా ఆదివారం మరోసారి నిప్పులు చెరిగారు. నేను వేసిన రోడ్లపై నడుస్తూ నాకు ఓటు వేయాలని, ఓటుకు రూ.5వేలు ఇవ్వగలను కానీ ఇవ్వనని సీఎం అన్నారు.
దీనికి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తన తండ్రి కర్జూరపు నాయుడు ఆస్తితో ప్రజలకేమీ పెన్షన్ ఇవ్వలేదని, రోడ్డు వేయడం లేదని, తన మామ ఎన్టీఆర్ ఆస్తితో ఏమీ రోడ్డు వేయట్లేదని, చంద్రబాబు, ఆయన కొడుకు అడ్డదిడ్డంగా సంపాదిస్తున్న డబ్బుతో ఈ రాష్ట్రానికి పెన్షన్లు ఇవ్వట్లేదని, రోడ్లు వేయడం లేదని మండిపడ్డారు.
ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలిసిందే
ప్రజలు కట్టిన పన్నులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా జన్మభూమి కమిటీలు పెట్టి అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వకుండా ఎంత ఇబ్బందిపెడుతున్నారో, రేషన్ కార్డులు తీసేసి వాళ్ల కుటుంబాలను ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలిసిందేనని రోజా అన్నారు.
వైయస్ వేసిన రోడ్ల మీద నడిచావ్
మాకు ఓటెయ్యకపోతే మీకు ఏదీ ఇవ్వము, ఏదీ తీసుకోకూడదని అంటున్నారే మరి, పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖరరెడ్డి కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు గానీ వేసిన రోడ్లపై మీరు ఏవిధంగా నడిచారని రోజా ప్రశ్నించారు.
మీ పార్టీ వాళ్లు తీసుకున్నారుగా..
వారు ఇచ్చిన సబ్సిడీ గ్యాస్ ఏవిధంగా తీసుకున్నారు? మీ పార్టీ వాళ్లు కూడా కాంగ్రెస్ ఇచ్చిన పెన్షన్లు కానీ, రేషన్లు కానీ ఎలా తీసుకున్నారని రోజా ప్రశ్నించారు. ఆ తర్వాత మీకు ఎందుకు ఓట్లేశారని అడిగారు. మీరు పాదయాత్ర చేసింది కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు వేసిన రోడ్ల మీదే అన్నారు.
మీరు ఎలా అడిగారు
అలాంటి రోడ్ల మీద నడిచిన మీరు, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఎలా మాట్లాడారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నానని సీఎం చంద్రబాబును రోజా ప్రశ్నించారు. రోజా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.