సత్తా ఉంటే అలా చేసి చూపించు.. ఛరిష్మా లేకే ఎన్టీఆర్ పేరుతో!: బాబుకు రోజా సవాల్
సత్తా ఉంటే జగన్ లా సొంత పార్టీ పెట్టి, ప్రతిపక్షంలో కూర్చొని అధికార పార్టీతో తలపడాలని సవాల్ విసిరారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుకు జనంలో అంతగా ఛరిష్మా లేనందువల్లే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. సత్తా ఉంటే జగన్లా సొంత పార్టీ పెట్టి, ప్రతిపక్షంలో కూర్చొని అధికార పార్టీతో తలపడాలని సవాల్ విసిరారు.
"కరప్షన్ కింగ్.. చంద్రబాబు: 56కుంభకోణాలు, 3లక్షల కోట్ల అవినీతి"
గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్న వైసీపీ ప్లీనరీ సమావేశంలో రోజా సీఎంపై ఈ వ్యాఖ్యలు చేశారు. గత మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా దూరంగానే ఉండిపోయారని, దీన్నిబట్టి ఆ పార్టీ ఎవరి చేతుల్లో ఉందనేది అర్థమవుతోందన్నారు. గత మహానాడుల్లో ఎన్టీఆర్ చిత్రపటాలను కూడా తీసేయించారని ఈ సందర్భంగా రోజా గుర్తు చేశారు.
ఎన్టీఆర్ స్థాపించిన సమయంలో ఉన్న పార్టీ సిద్దాంతాలేవి ప్రస్తుత టీడీపీలో లేవని విమర్శించారు. కేవలం ప్రచారం కోసం, ఎన్నికల్లో విజయం సాధించడం కోసం మాత్రమే ఎన్టీఆర్ పేరును చంద్రబాబు వాడుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్తే.. ఎవరూ ఓటేయరన్న విషయం ఆయనకు కూడా తెలుసునని రోజా ఎద్దేవా చేశారు.
ఇక జగన్ పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. ప్రతీ ఏటా ఆయన తన ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పిస్తున్నారని గుర్తుచేశారు. దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు.