రోజా రాయబారం: జగన్ పార్టీలోకి పురంధేశ్వరి, నిజమేనా?
ఇది సంచలనమే. దగ్గుబాటి పురంధేశ్వరి జగన్ పార్టీలో చేరుతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకో రోజా ఆమెతో మంతనాలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది.
విజయవాడ: ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఓ వార్త నిజమైతే అది సంచలనమే. ప్రస్తుతం బిజెపిలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులోకి వస్తారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమనేది తెలియదు.
పురంధేశ్వరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం ఖాయమైందనే ప్రచారం కూడా సాగుతోంది. దాంతో ఆమెతో చర్చలు జరపడానికి తమ పార్టీ శాసనసభ్యురాలు రోజాను వైయస్ జగన్ పంపించినట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరులో పురంధేశ్వరిని జగన్ను కలిసినట్లు, అప్పుడే పార్టీలోకి రావడం ఖాయమైనట్లు చెబుతున్నారు.
పార్టీలోకి వస్తానని చెప్పిన తర్వాత పురంధేశ్వరితో మంతనాలు జరిపేందుకు జగన్ రోజాను పంపించినట్లు చెబుతున్నారు. పార్టీలోకి వస్తానని పురంధేశ్వరి రోజాతో కూడా చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్రంలో విస్తృతమైన పరిచయాలు ఉండడమే కాకుండా ఎన్టీఆర్ కూతురు కూడా కావడం వల్ల పురంధేశ్వరి పార్టీలోకి వస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని జగన్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలో చక్రం తిప్పాలంటే తప్పదు...
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డికి పురంధేశ్వరి వంటి నాయకులు అవసరమనేది వేరుగా చెప్పాల్సిన పని లేదు. అందుకే జగన్ తనకు అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. పురంధేశ్వరితో మాట్లాడి రావాలని జగన్ అందుకే రోజాను పంపించారని చెబుతున్నారు.
దాదాపు 40 నిమిషాలు చర్చలు...
రోజాకు, పురంధేశ్వరికి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిగినట్లు సమాచారం. రోజా ఆమెను మర్యాదపూర్వకంగానే కలిసి, పార్టీలోకి రావాలని ఆహ్వానించారని సమాచారం. త్వరలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వస్తానని పురంధేశ్వరి చెప్పారని అంటున్నారు.
చంద్రబాబుతో విభేదాలతో కాంగ్రెసులోకి...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో విభేదాలతో దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెసులో ఆమెకు మంచి ప్రాధాన్యమే లభించింది. కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆమె కాంగ్రెసుకు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. తెలుగుదేశం, బిజెపి పొత్తు కారణంగా ఆమెకు ఆమెకు విశాఖపట్నం పార్లమెంటు సీటు కాకుండా రాజంపేట పార్లమెంటు సీటు వచ్చింది. ఆమె ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె బిజెపిలో కొనసాగుతున్నారు.
కారణం అదే కావచ్చు...
తెలుగుదేశం పార్టీతో బిజెపి వచ్చే ఎన్నికల్లో కూడా తెగదెంపులు చేసుకునే అవకాశం లేదు. రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశాలున్నాయి. దీంతో ఆశించిన చోట పోటీ చేసే అవకాశం పురంధేశ్వరికి రాకపోవచ్చు. పురంధేశ్వరికి కావాలనే చంద్రబాబు ప్రోద్బలంతో కష్టసాధ్యంగా విజయం సాధించే రాజంపేట సీటు గత ఎన్నికల్లో ఇచ్చారనే ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా అటువంటి రాజకీయమే నడిచే అవకాశాలు లేకపోలేదనే ఉద్దేశంతో పురంధేశ్వరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉండవచ్చునని అంటున్నారు.