భయం వద్దు, బాబుకు బొమ్మ కనిపించాలి.. బోండాకు 'బోడిగుండు' సవాల్: రోజా
ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది, సైకిల్ బయట ఉంటుంది.. ఇంటిపార్టీ గుర్తు ఫ్యాన్కే ఓటేయాలన్నారు.
నంద్యాల: స్మశానం ముందు ముగ్గు.. చంద్రబాబుకు సిగ్గు ఉండవని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో భూమా నాగిరెడ్డిని దొంగ, విషవృక్షం అని తిట్టిపోసి ఇప్పుడేమో దేవుడని పొగుడుతున్నారని మండిపడ్డారు.
మంత్రి పదవులకు మైనారిటీలు సరిపోరన్నట్లుగా వారికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వని చంద్రబాబు.. పనికిరానివాళ్లకు, దద్దమ్మ లాంటి లోకేష్కు మాత్రం ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారని విమర్శించారు. నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత గానీ ఫరూఖ్కు పదవి ఇవ్వలేదని అన్నారు.
ఎన్నికలు రాకపోయి ఉంటే మైనారిటీలకు ఆ పదవులు కూడా చంద్రబాబు ఇచ్చి ఉండకపోయేవారని, అదే మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనారిటీలను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని పేర్కొన్నారు. నలుగురికి మంత్రి పదవులు, మండలి డిప్యూటీ చైర్మన్ పదవి, ముస్లిం విద్యార్థినులకు రీయింబర్స్ మెంట్ ఇచ్చారని గుర్తుచేశారు. సోమవారం నంద్యాలలోని యాళ్లూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ వేయించిన రోడ్లపై నువ్వెలా:
టీడీపీకి ఓటేయకపోతే మేము నిర్మించిన రోడ్లపై నడవద్దు అని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రోజా మండిపడ్డారు. అలా అయితే మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేయించిన రోడ్లపై నువ్వు పాదయాత్ర ఎలా చేశావని చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన ద్వారా ఎంతో మేలు పొందిన రైతులు, మహిళలను ఎలా ఓట్లు అడిగావని నిలదీశారు. అసెంబ్లీ టైగర్, ఆంధ్రా ఫ్యూచర్ జగన్ కు ఓట్లేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
Recommended Video
భయపడాల్సిన పనిలేదు.. బాబుకు బొమ్మ కనిపించాలి:
ఓటర్లను భయపెట్టేలా టీడీపీ వ్యవహరిస్తోందని, వేరే వారికి ఓటు వేస్తే ప్రభుత్వ పథకాలు తొలగిస్తామని ప్రజలను బెదిరిస్తున్నారని రోజా ఆరోపించారు. కానీ ప్రజలంతా ఒక్కటే గుర్తుంచుకోవాలని మనం వేసే ఓటు ఎప్పుడు సీక్రెట్ గానే ఉంటుందని అన్నారు. కాబట్టి ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని, ధైర్యంగా, మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్న చంద్రబాబు దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా ఓటేయాలని పిలుపునిచ్చారు.
బోండాకు సమాధానం:
నంద్యాలలో ఓడిపోతే గుండు గీయించుకుంటారా? అని సవాల్ విసిరిన విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమాకు రోజా ధీటుగా బదులిచ్చారు. 'బోండాకు చంద్రబాబు పాలనపై అంత నమ్మకముంటే.. ఎస్.. గుండు కొట్టించుకోవడానికి నేను రెడీ' అని బదులిచ్చారు. అయితే టీడీపీలో చేరిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని, అప్పుడు బోడిగుండు ఎవరిదవుతుందో తేలిపోతుందని రోజా చెప్పుకొచ్చారు.
శిల్పా లోకల్:
శిల్పా మోహన్ రెడ్డి లోకల్ అని, ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటారని రోజా అన్నారు. అదే భూమా బ్రహ్మానందరెడ్డి గెలిస్తే.. ఎన్నికల తర్వాత ముఖం కూడా చూపించరని పేర్కొన్నారు. అఖిలప్రియకు, బ్రహ్మానందరెడ్డికి నంద్యాలలో కనీసం ఓటు సభ్యత్వం కూడా లేదన్నారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది, సైకిల్ బయట ఉంటుంది.. ఇంటిపార్టీ గుర్తు ఫ్యాన్ కు ఓటేసి జగన్ అన్నను గెలిపించాలని కోరారు.