ఇంత దారుణమా?.. మోసపోవద్దు, నేనెక్కడా కోచింగ్ తీసుకోలేదు: రోణంకి గోపాలకృష్ణ!
కోచింగ్ సెంటర్లు ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. తనకెవరూ కోచింగ్ ఇవ్వలేదని, సొంతంగా ప్రిపేర్ అయ్యానని పేర్కొన్నారు.
హైదరాబాద్: కోచింగ్ ఇవ్వమంటే నిరాకరించిన కోచింగ్ సెంటర్లు.. తీరా ర్యాంకు సాధించాక మాత్రం తమవాడే అని ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టేశాయి. శ్రీకాకుళంకు చెందిన సివిల్స్ ఆలిండియా మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ విషయంలో కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ దీనిపై స్పందించారు. కోచింగ్ సెంటర్ల వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టారు. తప్పుడు మాటలు చెప్పే కోచింగ్ సెంటర్లను నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు సలహా ఇచ్చారు. తానెక్కడా కోచింగ్ తీసుకోలేదని మరోమారు స్పష్టం చేసిన గోపాలకృష్ణ.. కోచింగ్ సెంటర్లు కావాలనే తన పేరును వాడుకుంటున్నాయని అన్నారు.
కోచింగ్ సెంటర్లు ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. తనకెవరూ కోచింగ్ ఇవ్వలేదని, సొంతంగా ప్రిపేర్ అయ్యానని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యం సొంతంగా చదివానని, జనరల్ స్టడీస్ మాత్రం బాలలత గారి వద్ద శిక్షణ పొందానని అన్నారు. హైదరాబాద్ లోని కొన్ని కోచింగ్ సెంటర్లు తన పేరుతో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
సివిల్స్ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులు కోచింగ్ సెంటర్లు నమ్ముకోవడం కన్నా సింత ప్రిపరేషన్ కే ప్రాధాన్యం ఇస్తే మేలని అన్నారు. సొంతంగా చదువుకోవడం కుదరకపోతే కోచింగ్ సెంటర్లకు వెళ్లాలని, కానీ వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
కాగా, గోపాలకృష్ణకు సివిల్స్ లో ఆలిండియా మూడో ర్యాంకు వచ్చిన మరునాడే ప్రధాన పత్రికలన్నింటిలోను కొన్ని కోచింగ్ సెంటర్లు తమవాడే అంటూ ప్రకటనలు ఇచ్చుకున్నాయి. సొంతంగా చదువుకున్నవాడిని కూడా తమవాడే అంటూ ప్రచారం చేసుకోవడం పట్ల కోచింగ్ సెంటర్లపై విమర్శలు వెల్లువెత్తాయి.