అసెంబ్లీ లాంజ్లో వైయస్ చిత్రపటం తొలగింపు, అందుకే తీసేశారు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఆవరణలోని సభ్యుల లాంజ్లో ఉన్న దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని తొలగించడం చర్చనీయాంశమైంది. దీనిపై నిరసన తెలపాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం నిర్ణయించింది.
లాంజ్లో వైయస్ నిలువెత్తు ఫోటో ఉంది. దీనిని ఇటీవల శాసన సభ ఇంఛార్జ్ కార్యదర్శి కె సత్యనారాయణ సిబ్బందితో తొలగింప చేశారు. సభాపతి కోడెల శివప్రసాద రావు ఆదేశాల మేరకు వైయస్ ఫోటో తొలగిస్తున్నామని సిబ్బందికి సత్యనారాయణ చెప్పారని తెలుస్తోంది.
ఏపీ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైయస్ ఫోటో ఉన్న లాంజ్ ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ పలుమార్లు టిడిపి శాసన సభా పక్ష సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశం సమయంలో వైయస్ చిత్రపటానికి ముసుగు వేసేవారు. వైయస్ మృతి చెందినప్పుడు దీనిని అక్కడ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో మాజీ సభాపతుల చిత్రపటాలు తప్ప, ముఖ్యమంత్రులవి ఏర్పాటు చేసే సంప్రదాయం లేకపోవడం వల్లనే వైయస్ చిత్రపటాన్ని తొలగించినట్లు శాసన సభ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పని చేసిన ముఖ్యమంత్రుల ఫోటోలు లేవని గుర్తు చేస్తున్నాయి.