వియ్యంకులైన టీడీపీ ఎమ్మెల్యేలు: పెళ్లికి రూ.10కోట్ల ఖర్చు..
జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కోసం సెట్టింగులు వేసిన బెంగుళూరుకు చెందిన ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీతో ఈ పెళ్లి కోసం సెట్టింగులు వేశారు.
గుంటూరు: వియ్యంకులుగా మారిన టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ లు తమ పిల్లల వివాహానికి దాదాపు రూ.10కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. 30ఎకరాల స్థలంలో భారీ సెట్టింగులతో హంగు ఆర్భాటాలతో పెళ్లి జరిపించినట్టు సమాచారం.
కాగా, టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కుమార్తె లక్ష్మీ సౌజన్య, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తనయుడు సాయి సుధాకర్ ల వివాహం బుధవారం జరిగింది. మేడికొండూరు మండలంలోని కైలాసగిరి వద్ద ఎమ్మెల్యే శ్రీధర్ కు చెందిన అభినందన వెంచర్ లో ఈ పెళ్లి జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కోసం సెట్టింగులు వేసిన బెంగుళూరుకు చెందిన ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీతో ఈ పెళ్లి కోసం సెట్టింగులు సమకూర్చింది. 30ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సెట్టింగ్ లో.. వివాహ మంటపాన్ని ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో నిర్మించారు. ఇందుకోసం రూ.2.50కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇక భోజనాల కోసం దాదాపు రూ.2కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
పెళ్లికి వచ్చేవారి కోసం వినుకొండ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు, జిల్లాలోని పలు ప్రైవేటు ట్రావెల్స్, బస్సులు, కార్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.42లక్షల దాకా ఖర్చు శారు. వీటన్నింటికి సిబ్బంది, కూలీలు ఇతరత్రా ఖర్చులు కలుపుకుని రూ.కోటి ఖర్చు చేశారు. సుమారు 200మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేయించారు.