ఏపీకి చేరిన రూ.2,500కోట్ల నగదు: విమానాల్లో తరలింపు
రిజర్వ్బ్యాంక్ నుంచి రూ.2500కోట్ల నగదు శుక్రవారం ఏపీకి చేరుకుంది. ఈ డబ్బును యుద్ధప్రాతిపదికన విమానాల ద్వారా నగదును రాష్ట్రానికి చేరవేశారు.
అమరావతి: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఏపీ ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే వార్త ఇది. రిజర్వ్బ్యాంక్ నుంచి రూ.2500కోట్ల నగదు శుక్రవారం రాష్ట్రానికి చేరుకుంది. ఈ డబ్బును యుద్ధప్రాతిపదికన విమానాల ద్వారా నగదును రాష్ట్రానికి చేరవేశారు.
విశాఖ, తిరుపతి, కడప, అనంతపురం ప్రాంతాలకు విమానాల్లోనూ, మిగిలిన ప్రాంతాలకు రోడ్డుమార్గాల ద్వారా నగదు చేరవేస్తున్నారు. కాగా, రిజర్వ్బ్యాంక్ నుంచి వచ్చిన నగదు మధ్యాహ్నానికల్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చేరుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
బ్యాంకర్లు తాత్సారం చేయకుండా ప్రజలకు నగదు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. సమయపాలన లేకుండా ప్రజల సౌకర్యార్థం పనిచేయాలని సూచించారు. సాయంత్రానికల్లా నగదు కొరత సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఒకటో తేదీన సమన్వయంతో పని చేసిన బ్యాంకర్లకు ఈ సందర్భంగా చంద్రబాబు అభినందనలు తెలిపారు.