చంద్రబాబు ఆదేశాలు: సిరంజి సైకోని పట్టిస్తే రూ. 50వేల బహుమతి
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో గత వారం రోజులుగా సంచలనం సృష్టిస్తోన్న సైకో వ్వవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరీయస్ అయ్యారు. శుక్రవారంలోగా ఆ సైకోను పట్టుకోవాలని ఐజీ, డీఐజీ, ఎస్పీకి బాబు ఆదేశాలు జారీ చేశారు.
అయితే గత వారం రోజుల నుంచి సైకోను పట్టుకోవడం కోసం పోలీసులు చేయని ప్రయత్నం లేదు. అయినా సరే ఆ సైకో జాడ లేదు. ఈ వ్వవహారం జిల్లా పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో సైకోను పట్టుకునేందుకు ప్రజల సహకారం తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.
దీంతో సైకోను పట్టించిన వారికి రూ. 50,000 వేల బహుమతి అందిస్తామని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40 ప్రత్యేక బృందాలు, 15 చెక్ పోస్టులు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 9 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
బాధితుల సమాచారం ప్రకారం సైకో ఊహాచిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 100, లేదా 9440796600 నెంబర్కు నిందితుని సమాచారం ఇవ్వాలని తెలిపారు. సైకో ఉపోయోగిస్తున్నది నీడిల్ మాత్రమే, అందులో ఎలాంటి మందులేదని నిర్ధారించినట్లు ఎస్పీ వివరించారు.
సైకో చర్యలపై ఎవరూ ఆందోలన చెందొద్దని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఒంటరిగా నడిచి వెళుతున్న మహిళలే లక్ష్యంగా సిరంజీలతో దాడులకు పాల్పడుతూ ఓ సైకో భయాందోళనలకు గురిచేస్తున్నాడు.
వారం రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఓ సైకో చేస్తున్న ఈ దాడితో ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. మహిళలు, యువతులనే లక్ష్యంగా చేసుకుని అతడు దాడి చేస్తుండడంతో వారు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.