'నంద్యాలలో రూ.11లక్షలు సీజ్, వ్యక్తిగత విమర్శలు వద్దు, ఇవీ ఎన్నికల ఏర్పాట్లు!'
ఇప్పటివరకు నంద్యాల నియోజకవర్గంలో రూ.11లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎపీ ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అన్నారు.
నంద్యాల: నంద్యాల ఉపఎన్నికను ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చంద్రబాబు సర్కార్ మూడేళ్ల పాలనకు ఇదొక రెఫరెండంలా ఉపయోగపడుతుందని వైసీపీ వ్యాఖ్యానిస్తుండటంతో.. టీడీపీకి ఇది అగ్నిపరీక్షలా తయారైంది.
తమ సత్తా తగ్గిపోలేదని నిరూపించుకోవాలంటూ అటు వైసీపీకి కూడా ఈ ఎన్నికల్లో గెలవడం అనివార్యం. నేతలు పార్టీ మారినా ప్రజలు తమ వెంటే ఉన్నారని నిరూపించుకోవడానికి వైసీపీ ఇక్కడి గెలుపు ఉపయోగపడుతుంది.
ఈ నేపథ్యంలో రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పార్టీల సంగతెలా ఉన్నా.. ప్రజలను ప్రలోభ పెట్టే వ్యూహాలు కూడా అంతే స్థాయిలో అమలవుతున్నాయి. ఇప్పటివరకు నంద్యాల నియోజకవర్గంలో రూ.11లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎపీ ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అన్నారు.
దీన్నిబట్టి నంద్యాల ఉపఎన్నికలో డబ్బు ప్రహహాం జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉపఎన్నిక నేపథ్యంలో వ్యక్తిగత విమర్శలకు దిగవద్దని కూడా భన్వర్ లాల్ సూచించారు. నంద్యాల ఉప ఎన్నికకు 250 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నంద్యాలలో మొత్తం 2,19,108 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నామని, అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్కాస్టింగ్ ఉంటుందని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వీడియోగ్రఫీ చేస్తామని వివరించారు.