సాక్షిలో రామోజీ బొమ్మ.. ఆస్తుల లెక్కలా! మ్యాటరేంటి..!?
హైదరాబాద్ : సాక్షిలో రామోజీ ప్రస్తావనంటే.. విషయమేదో వివాదంతో ముడిపడి ఉన్న ప్రస్తావనే అన్న ఆలోచన రావడం సహజం. అంతలా సాక్షికి రామోజీ ఈనాడుకు మధ్య పత్రికా యుద్దాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజా ప్రస్తావనకు వివాదంతో ఎలాంటి ముడిలేదు.
దేశంలోని ఏయే నగరాల్లో ఎంతమంది బిలియనీర్లు, మిలియనీర్లు ఉన్నారన్న లెక్క తేలుస్తూ న్యూ వరల్డ్ వెల్త్ తాజాగా ఓ జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో.. రామోజీని కూడా ఓ బిలియనీర్ గా పేర్కొంటూ సాక్షి ఆసక్తికర కథనం ప్రచురించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఏడుగురు బిలియనీర్స్ ఉన్నారని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక వెల్లడించింది.
జాబితాలో ఉన్న ఐదు సంస్థల గురించి న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ వెల్లడించగా.. మిగతా రెండు సంస్థలు రామోజీ గ్రూప్స్ మరియు సి.విశ్వేశ్వరరావు నేతృత్వంలోని నవయుగ గ్రూప్స్ అనేది సాక్షి అంచనా. కాగా, న్యూ వరల్డ్ వెల్త్ వెల్లడించిన జాబితాలో రూ. 6.5కోట్ల విలువ గల నికర ఆస్తులను మిలియనీర్లుగా, రూ.6500కోట్ల నికర ఆస్తులను కలిగిన వారిని బిలియనీర్లుగా సంస్థ పేర్కొంది.
అత్యంత సంపన్నులు నివసిస్తున్న దేశ నగరాల జాబితాలో ముంబై అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ నిలవడం గమనార్హం. హైదరాబాద్ లో 8200 మంది మిలియనీర్లు, ఏడుగురు బిలియనీర్లు ఉన్నట్టు న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక తెలిపింది. కాగా, హైదరాబాద్ లోని బిలియనీర్లు మిలియనీర్లు మొత్తం ఆస్తి విలువ రూ.20.1లక్షల కోట్ల ఆస్తిగా తేల్చింది.
ప్రత్యక్షంగా బిలియనీర్ల పేర్లను న్యూ వరల్డ్ వెల్త్ వెల్లడించినప్పటికీ.. సంస్థ ఇచ్చిన లిస్టెడ్ కంపెనీల్లో ఆయా వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యుల వాటాల ఆధారంగా పరిశీలిస్తే..
అరబిందో ఫార్మా ప్రమోటర్లయిన నిత్యానందరెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి కుటుంబీకులకు 47.74శాతం వాటా ఉన్నట్టు, వీటి విలువ రూ.24.255 కోట్లు ఉన్నట్టు సాక్షి కథనంలో పేర్కొంది.
అమరరాజా బ్యాటరీస్ ప్రమోటర్లు గల్లా రామచంద్రనాయుడి కుటుంబానికి ఆయనకు చెందిన కంపెనీలకు 52వాతం వాటా ఉండగా.. దీని మార్కెట్ విలువ రూ.9.139కోట్లు ఉంటుందట.
అలాగే దివిస్ ల్యాబ్స్ లో మురళి దివి కుటుంబం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లో దివంగత అంజిరెడ్డి కుటుంబీకుల వాటాలను లెక్కగట్టిన సాక్షి వారిని బిలియనీర్లుగా పేర్కొంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో రామోజీ గ్రూప్స్ ఉండవచ్చనేది సాక్షి అంచనా. మార్కెట్ విలువ ప్రకారం రామోజీ గ్రూప్స్ విలువ బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఉండవచ్చునని భావిస్తున్నందువల్ల రామోజీని కూడా బిలియనీర్ల జాబితా చేర్చేసింది సాక్షి. న్యూ వరల్ద్ వెల్త్ నివేదిక ప్రకారం చివరి ఏడో స్థానంలో నవయుగ గ్రూప్స్ సంస్థ అధినేత సి.విశ్వేశ్వరరావు ఉండవచ్చనేది మరో అంచనా.
ఏదేమైనా సాక్షిలో రామోజీ గురించి ప్రస్తావన రావడమే ఆసక్తిని రేకెత్తించే విషయమైతే.. అదీ ఆయన ఆస్తుల లెక్కలను తేల్చే విషయం కావడంతో విషయం కాస్త మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.