సాక్షి ప్రసారాలు కట్: నోరి జారిన మంత్రులు, చంద్రబాబుకు చిక్కులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన సాక్షి టీవీ చానెల్ ప్రసారాల నిలిపివేతపై మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాస రావు నోరు జారడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నారు. మీడియా స్వేచ్ఛపై మాట్లాడే చంద్రబాబుకు ఇది నిజంగా ఇబ్బంది కలిగించే వ్యవహారమేనంటున్నారు.
సాక్షి టీవీ చానెల్ ప్రసారాలను తామే నిలిపేయించామని మంత్రులు గంటా, చినరాజప్ప చెప్పారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీడియాకు దగ్గరగా ఉంటూ, స్నేహపూర్వక వైఖరి ప్రదర్శిస్తుంది. తమకు గిట్టని మీడియా పట్ల కూడా స్నేహపూర్వకంగా ఉన్నట్లే కనిపిస్తుంది. ముద్రగడ దీక్ష నేపథ్యంలో దానికి సంబంధించి సాక్షి చానెల్ ప్రసారాలను నిలిపివేయడంపై దుమారం చెలరేగుతోంది.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కొన్ని పత్రికలు, చానెళ్లు తమకు వ్యతిరేకంగా రాసినా, ఈ విధంగా ఎప్పుడూ వ్యవహరించలేదని జగన్ గుర్తు చేశారు. ప్రభుత్వమే ప్రసారాలు నిలిపివేయడం దారుణమని జగన్ దుయ్యబట్టారు.అయితే, ప్రసారాల నిలిపివేతకు తమకు సంబంధం లేదని, అది ఎంఎస్ఓలు తీసుకునే నిర్ణయాలని తమ పార్టీ నేతలు ఖండిస్తారని ఆశించిన పార్టీ వర్గాలకు మంత్రులు చినరాజప్ప, గంటా చేసిన ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించారు.
సాక్షి ప్రసారాల తామే నిలిపేశామని చెప్పడం ద్వారా తమ పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేసిందని భావిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును చూసి కూడా పాఠాలు నేర్చుకోకపోతే ఎలా అని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో ఏబీఎన్, టీవీ 9 చానెళ్లను నిషేధించిన సమయంలో టిడిపి ఆందోళనలు నిర్వహించింది. పత్రికాస్వేచ్ఛను కేసీఆర్ మంటకలుపుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు.
అయితే, వాటితో తమకు సంబంధం లేదని, అది ఎంఎస్ఓలు తీసుకున్న నిర్ణయమని, దానికి తామెలా కారణమవుతామని తెలంగాణ మంత్రులు ఎదురుదాడి చేసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు సాక్షి చానెల్ వ్యవహారంలో తమ పార్టీ నాయకత్వం కూడా అదే విధానం అనుసరిస్తుందని అనుకున్నామని అంటున్నారు. కానీ తామే నిలిపేయించామని చెప్పి తప్పులో కాలేశారని అంటున్నారు.