కేసీఆర్తో సానియా మీర్జా, అబద్దమని ఎర్రబెల్లి ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా బుధవారం మధ్యాహ్నం కలిశారు. ఇటీవల సానియా డబ్ల్యూటీఏను గెలుచుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన ఆమె ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిశారు. ఆమె తెలంగాణ రాష్ట్రానికి ప్రచారకర్తగా ఉన్నారు.
రైతు ఆత్మహత్యల పైన తెరాస అబద్దాలు: ఎర్రబెల్లి
రైతు ఆత్మహత్యల పైన తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని అబద్దాలు ఆడుతోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నష్టపోయిన ఒక్క రైతును పరామర్శించలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యల పైన ప్రభుత్వం అబద్దాలు ఆడటం సరికాదన్నారు.
ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. నిర్ణాలు తీసుకోవడంలో కనీసం మంత్రులు, అధికారులతూ కూడా కేసీఆర్ చర్చించడం లేదన్నారు.
తాము త్వరలో ఢిల్లీకి వెళ్తామన్నారు. రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. అక్కడ తాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ, విద్యుత్ శాఖ మంత్రులను కలుస్తామని చెప్పారు. అలాగే సీసీఐని కూడా కలుస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న తొలి బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 5న ఉదయం పదకొండు గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవనున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో డిప్యూటీ సీఎం రాజయ్య బడ్జెట్ ప్రవేశపెడతారు. తరువాత 7,8,9 తేదీల్లో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. నెల రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.
వాడివేడిగా కృష్ణా రివర్ బోర్డు సమావేశం
జలసౌధలో కృష్ణా రివర్బోర్డు సమావేశం వాడివేడిగా సాగింది. శ్రీశైలం విద్యుదుదత్పత్తిపై ఇరు రాష్ర్టాలకు చెందిన చీఫ్ ఇంజనీర్లు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలం ఎడవ కాలువలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి భినాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
నిబంధనల మేరకే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలంగాణ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ తెలిపారు. దీనిపై ఏపీ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయవద్దని, అత్యవసర పరిస్థితుల్లోనే విద్యుదుత్పత్తి చేయాలని వెంకటేశ్వర్లు వాదించారు.
ఈ క్రమంలో బోర్డు చైర్మన్ పండిట్ జోక్యం చేసుకుని వాదనలు మాత్రమే వినిపించాలని ఇరువురు ఇంజనీర్లను వారించాలని సమాచారం. ఉత్పత్తి, నీటి కేటాయింపుల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.