ప్రత్యేక హోదా: 36 గంటలు సెల్ టవర్పై అతను
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో సెల్ టవర్ ఎక్కిన సంజీవరావు నిరసన 36 గంటల పాటు కొనసాగింది. చివరికి మంత్రి పత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకోవడంతో అతను కిందికి దిగాడు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో అతను ఆదివారం సాయంత్రం సెల్ టవర్ దిగాడు.
సంజీవరావు స్వస్థలంలో చెక్ డ్యామ్ నిర్మిస్తామని కూడా మంత్రి చెప్పారు. శనివారం ఉదయం 10 గంటలకు సెల్ టెవర్ ఎక్కిన సంజీవరావు ఆదివారం సాయంత్రం కిందికి వచ్చాడు. పాత గుంటూరు పెదకాకానీ పోలీసులు గుంటూరు ఆర్డీవో సంజీవరావును కిందకు దింపేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఆర్డీవో భాస్కర నాయుడు అంతకు ముందు సంజీవరావుతో సెల్ఫోన్లో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని కిందికి దిగాల్సిందిగా కోరారు. మరోవైపు సంజీవరావు కూతురు తండ్రితో సెల్ఫోన్లో మాట్లాడింది. డాడీ కిందికి దిగిరావాలని కోరింది. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు తన ఆందోళన కొనసాగుతుందని సంజీవరావు తేల్చి చెప్పారు.
మంత్రి పుల్లారావు, సంజీవరావుతో ఫోన్లో మాట్లాడారు. నీ డిమాండ్ చెప్పాలని అడిగారు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు తన స్వగ్రామం అయిన నెల్లూరు జిల్లా, కొండాపూర్ మండలం, పార్లపల్లి గ్రామానికి చెక్ డామ్ నిర్మానం ఒకటి కావాలని అడిగారు. మంత్రి అంగీకరిస్తూ దిగిరావాలని కోరారు. అనంతరం మంత్రి వెళ్లిపోయిన తర్వాత తనతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడి హామీ ఇస్తే కిందికి దిగుతామని సంజీవరావు భీష్మించుకు కూర్చున్నాడు.
చివరకు పత్తిపాటి పుల్లారావు హామీ ఆయన కిందికి దిగి వచ్చాడు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తాను ఏ రాజకీయ పార్టీకి కూడా చెందినవాడిని కానని సంజీవరావు అన్నారు. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే సమస్యలు అలాగే ఉండిపోతాయని, అందుకే తాను ముందుకు వచ్చానని అన్నారు.