అంతా సిద్ధం: ఏపీలో గోదావరి పుష్కరాలకు 161 ప్రత్యేక రైళ్లు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాల సందర్భంగా 161 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. విశాఖపట్నం - తిరుపతి మధ్య 2 ప్రత్యేక రైళ్లు, రాజమండ్రి- అనకాపల్లి మధ్య 24 ప్రత్యేక రైళ్లు, అనకాపల్లి - రాజమండ్రి మధ్య 29 ప్రత్యేక రైళ్లు, రాజమండ్రి- గుంటూరు మధ్య 24 ప్రత్యేక రైళ్లు, గుంటూరు- రాజమండ్రి మధ్య 29 మెము ప్రత్యేక రైళ్లు నడపనుంది.
అదేవిధంగా గుంతకల్లు - నర్సాపూర్ మధ్య 14 ప్రత్యేక రైళ్లు, గుంటూరు- నర్సాపూర్ మధ్య 32 ప్రత్యేక రైళ్లు, మచిలీపట్నం- అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు, తిరుపతి- విశాఖ మధ్య 2 ప్రత్యేక రైళ్లు, విశాఖపట్నం - ధర్మవరం మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
సాగునీటి ప్రాజెక్టుల పేర్లు మార్పు
ఏపీలో రెండు సాగునీటి ప్రాజెక్టుల పేర్లను ప్రభుత్వం గురువారం మార్చింది. శ్రీకృష్ణ దేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పేరును గాలేరు నగరి సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చింది.
అదే విధంగా అనంత వెంకటరెడ్డి హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పేరును హంద్రినీవా సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.