ప్రత్యేక హోదా రాలేదనే మనస్తాపంతో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదనే మనస్థాపంతో ఓ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రమణయ్య (40) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
గూడూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రమణయ్య ఆత్మహత్యకు ముందు నెల్లూరు జిల్లా కలెక్టరు పేరిట మూడు సూసైడ్ నోట్లు రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాక గ్రామం అభివృద్ధి చెందటం లేదని, పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి బావిలోనుంచి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ విషయం తెలిసిన జనం పెద్దసంఖ్యలో బావి వద్దకు వచ్చారు.
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, ప్రేయసి మృతి
ఇదిలావుంటే, కృష్ణా జిల్లా మైలవరం మండలం కిర్తిరాయినిగూడెంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో ప్రియురాలు మృతి చెందింది. ప్రియుడి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
దంపతుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లెలో కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.