హిమబిందు రేప్, హత్య కేసును కొట్టేసిన కోర్టు: ఆరుగురికి విముక్తి
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్యాంక్ మేనేజర్ భార్య హిమబిందుపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారనే అభియోగాలపై నమోదైన కేసును సెషన్స్ కోర్టు మంగళవారంనాడు కొట్టేసింది. ఈ కేసులో ఆరుగురు నిందితులకు విముక్తి లభించింది. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసులో పోలీసులు 36 మంది సాక్షులను ప్రవేశపెట్టడమే కాకుండా 68 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. అయినప్పటికీ ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలను సమర్పించడంలో విఫలం కావడంతో కోర్టు కేసును కొట్టేసింది. ఆమె మృతదేహాన్ని ఇంటి నుంచి బందరు కాలువలో పడేయడానికి తీసుకెళ్లిన ఘట్టాలకు సంబంధించి పోలీసులు సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది.
విజయవాడలోని పడమటకు చెందిన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ మోదమూడి సాయిరాం భార్య హిమబిందు (43) 2014, మార్చి 15న అదృశ్యమయ్యారు. మార్చి 17వ తేదీ రాత్రి ఆమె మృతదేహం కంకిపాడు వద్ద బందరు కాలువలో లభ్యమైంది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరుగురిపై పోలీసులు అభియోగాలు మోపారు.
మిస్టరీగా మారిన ఈ హత్య కేసు వివరాలను విజయవాడ డిసిపి ఎం రవిప్రకాష్ అప్పట్లో మీడియాకు వివరించారు. నిందితులు మహ్మద్ సుభానీ(27), గోపీకృష్ణ(25)లను మీడియా ముందు ప్రవేశపెట్టి ఆయన చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బ్యాంకు మేనేజర్ సాయిరాం నివాసం ఉండే అపార్టుమెంటు యజమానికి సుభానీ కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. గోపీకృష్ణ గతంలో డ్రైవర్గా పని చేశాడు. హిమబిందు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, నల్లా మరమ్మతు చేస్తామంటూ వారిద్దరూ లోనికి చొరబడ్డారు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. వారితోపాటు వచ్చిన మరో నలుగురు కూడా ఆమెపై ఘాతుకానికి ఒడిగట్టారు.
అనంతరం ఆమెను గొంతు నులిమి చంపేశారు. శవాన్ని ఖాళీగా ఉన్న పక్క ఫ్లాటులోకి తీసుకెళ్లి దాచేశారు. కాగా, సాయిరాం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా భార్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నిందితులు బాధిరాలి ఫోన్ ద్వారా సాయిరాంకు, పోలీసులకు ఫోన్ చేసి ఆమెను తమతోపాటు తీసుకెళ్తున్నామని చెప్పారు. దీంతో పోలీసులు ఆ సెల్ఫోన్పై నిఘా పెట్టారు. మార్చి 17వ తేదీ తెల్లవారుజామున దుండుగులు ఆమె మృతదేహాన్ని బందరు కాలువలో పడేశారు.
అయితే, పోలీసులు సరైన సాక్ష్యాలను సమర్పించలేదంటూ కేసును సెషన్స్ కోర్టు కొట్టేసింది. పోలీసులు చెప్పిన వివరాలు కల్పిత కథలాగా ఉన్నాయని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.