చిత్తూరు జిల్లాలో కారు, లారీ ఢీ: ఆరుగురు మృతి
హైదరాబాద్: చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. వారం రోజుల్లో రోడ్డు ప్రమాదాల్లో 15 మంది మరణించారు. తాజాగా శనివారం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సీతారాంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మృతులు గుంటూరు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందినవారు. తిరుపతి నుంచి కాళహస్తికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కంటైనర్ లారీ కారును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయపడిన నలుగురు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను కోటేశ్వరమ్మ, తిరుపాలు, భార్గవి, వెంకటేశ్వర్లు, నాగరాజులుగా గుర్తించారు. వీరిలో కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. లారీ అతి వేగం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.
కాగా, చిత్తూరు జిల్లా పీలేరు-మదనపల్లె జాతీయ రహదారిపైన అంకాళమ్మ గుడి సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె 1వ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి మదనపల్లెకు వెళ్తుండగా పీలేరువాసులు మదనపల్లిలో ఓ వివాహానికి వెళ్లి తిరిగి ప్రయాణంలో కారు పీలేరుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. అంకాళమ్మ గుడి వద్ద ఆర్టీసీ బస్సు అతివేగంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడకక్కడే పీలేరు వాసులు బీరువాల శీను (50), తలపల హైస్కూల్లో పనిచేస్తున్న టీచర్ ఆనంద్ (45), ఆయన కూతురు స్రవంతి (7)లు మృతిచెందారు.
కారులో ప్రయాణిస్తున్న ఆనంద్ భార్య సరళాదేవి, శీను భార్య ఉమాదేవి, ఆనంద్ పెద్దకుమార్తె సంగీత (8) తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండటంతో బస్సులోని ప్రయాణికులు 108కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పీలేరు ఎస్ఐ తేజోమూర్తి, సిబ్బంది క్షతగాత్రులను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాసుపత్రికి చేర్చారు. అనంతరం గాయపడిన వారిని పీలేరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స చేసి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.