సెక్స్రాకెట్ గుట్టురట్టు: ముంబై యువతి కేకలు వేయడంతో పట్టేశారు
విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ భారీ సెక్స్ రాకెట్ వ్యవహారంపైపోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ: ముంబై, బెంగళూరుల నుంచి యువతులను రప్పించి వారితో గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ భారీ సెక్స్ రాకెట్ వ్యవహారంపైపోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ కృష్ణలంకకు చెందిన దాసరి మేరీ కొంతకాలంగా వ్యభిచార ముఠాను నిర్వహిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తోంది. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఓ యువతిని బెంగుళూరులో ప్రియ అనే మహిళ ద్వారా ఇటీవల విజయవాడకు తీసుకొచ్చారు.
కాగా తాను ఈ వృత్తి చేయనని, ముంబై వెళ్లిపోతానని.. తనకు భర్త, ఇద్దరు పిల్లలున్నారని ఈ యువతి చెప్పినా.. పట్టించుకోకుండా ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను ఆదివారం కారులో ఎక్కించుకుని రాజమహేంద్రవరం తీసుకువెళుతుండగా ఏలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎలా పట్టుకున్నారంటే..
ముఠా సభ్యులు ఐదు రోజుల ఒప్పందంపై ఈ యువతిని బెంగళూరు నుంచి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. గుడివాడలో రెండు రోజులు ఉంచిన అనంతరం ఆమెను రాజమహేంద్రవరంలో ఓ విటుడి వద్దకు తీసుకువెళ్లేందుకు నిర్వాహకురాలు దాసరి మేరీ, డ్రైవర్ కొల్లిపర విజయ్కుమార్లు ప్రయత్నించారు. ఆమెను ఆదివారం గుడివాడలో కారు ఎక్కించుకోగా ఇంటికి వెళ్లిపోతానని.. తనను వదిలేయమని ఈ యువతి ప్రాధేయపడింది.
అయితే, ఒప్పందం ప్రకారం మరో మూడు రోజులు తమవద్దే ఉండాలని నిర్వాహకులు ఆమెను బలవంతం చేశారు. తాము చెప్పినట్లు వినకుంటే మధ్యలోనే వదిలేస్తామని బెదిరించారు. ఏలూరు కొత్త బస్డాండ్ సమీపంలోకి రాగానే ఆ యువతిని బెదిరించాలనే ఉద్దేశంతో ఆమెను కారులో నుంచి దింపేశారు. ఆమె లగేజీ ఇవ్వకుండా ముందుకు వెళ్లి కారును నిలుపుదల చేశారు. దీంతో ఆ యువతి కంగారుపడి తన లగేజీ పట్టుకుపోతున్నారంటూ కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు.
విషయాన్ని పోలీసులకు చెప్పటంతో వారు ఛేజింగ్ చేసి ఆ కారును పట్టుకున్నారు. నిర్వాహకురాలిని, డ్రైవరును, కారును త్రీటౌన్ పోలీసుస్టేషన్కు తరలించి పూర్తిస్థాయిలో విచారించారు. ఈ ముఠా కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా గుడివాడ వన్టౌన్ ప్రాంతంలో రెండురోజులు ఉన్నట్లు ఆ యువతి చెప్పటంతో ఈ కేసును గుడివాడ పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు ఏలూరు నగర సీఐ రాజశేఖర్ తెలిపారు. కాగా, ముంబై, బెంగళూరు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి యువతలను రప్పించి వారితో ఇలా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది.