కెసిఆర్పై చీటింగ్ కేసు పెట్టాలి: షబ్బీర్, వలసలపై వీహెచ్
హైదరాబాద్: తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై చీటింగ్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు నిరంతరం 8గంటల విద్యుత్ ఇస్తామని, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని కెసిఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చారని, వాటిని ఇప్పుడు మర్చిపోయారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఏ సమస్య వచ్చిన అది కాంగ్రెస్ వల్లేనని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం.. అధికారంలో ఎందుకు కొనసాగుతుందని ప్రశ్నించారు. తమకు అధికారం ఇస్తే సమస్యలను ఏలా పరిష్కరించాలో చేసి చూపిస్తామని షబ్బీర్ అలీ అన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం దివంగత కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించడం స్వాగతించదగినదని షబ్బీర్ అలీ అన్నారు. అయితే మోడీ గాంధేయవాది, పటేల్ వాది అయితే పటేల్ హోంమంత్రిగా ఉన్న సమయంలో బ్యాన్ చేసిన ఆర్ఎస్ఎస్పై ఇప్పుడు నిషేధం విధించాలని అన్నారు.
వలసలకు రాష్ట్ర నాయకత్వమే కారణం: వీహెచ్
కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అధికార పార్టీ టిఆర్ఎస్లోకి వలస వెళ్లడానికి పిసిసి, సిఎల్పీ నేతలే బాధ్యత వహించాలని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్లోని నేతల వలసలను పసిగట్టడంలో పార్టీ సమన్వయ కమిటీ విఫలమైందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వీహెచ్ వివరించారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో తరచుగా సమావేశం కావాలని పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలకు సూచించారు. అయితే వారికి రాష్ట్ర నాయకత్వం సమాచారం అందించాలని అన్నారు. సమాచారం లేకుండా నిర్వహిస్తే ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలో అందర్నీ కలుపుకోవడం పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అన్ని పదువులు అనుభవించి కూడా పార్టీని వదిలిపెట్టడం సరికాదని అన్నారు. కోట్లు సంపాదించిన కొందరు నాయకులు పార్టీ కార్యకర్తలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.