నిధుల విడుదలలో జాప్యం ఎందుకు: కెసిఆర్ను ప్రశ్నించిన షబ్బీర్
హైదరాబాద్: నిధుల విడుదలలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గొప్పలకుపోయి రూ. లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 21వేల కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసిందని అన్నారు. ఇచ్చిన హామీల మేరకు నిధులను వెంటనే విడుదల చేయాలని అన్నారు.
ఆర్థిక సంవత్సరం మూడు నెలలే ఉన్నందున మిగిలిన 80శాతం నిధులను ఏ లెక్కన ఖర్చు పెడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు వెయ్యి కోట్లు అని చెప్పిన ప్రభుత్వం రూ. 174 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేసిందన్నారు.
పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. వర్షాభావ మండలాలను కరువు మండలాలుగా ఎందుకు ప్రకటించడం లేదని షబ్బీర్ అలీ నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. జనవరి మొదటి వారంలో కరువు మండలాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే వాయిదా
హైదరాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఏరియల్ సర్వే వాయిదా పడింది. సీఎం కేసీఆర్ రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఏరియల్ సర్వే అనంతరం రెండు జిల్లాల అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.