తెలంగాణలో షర్మిల పరామర్శ యాత్ర: పొంగులేటి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల పరామర్శ యాత్ర ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆమె పరామర్శ యాత్ర డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో ఉంటుందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెంట్ అంకెల గారడీలా ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కేటాయింపులన్నీ వాస్తవానికి దూరంగా ఉన్నాయని అన్నారు. గుజరాత్ కంటే తెలంగాణ ఆదాయం ఎక్కువగా ఉందని బడ్జెట్ ద్వారా నిరూపితమైందని చెప్పారు. బంగారు తెలంగాణ కాదు.. వజ్ర తెలంగాణ కావాలని ఆయన అన్నారు.
తాకట్టుపెట్టారు: మోత్కుపల్లి
తెలంగాణ సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కుటుంబం కోసం వాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బడ్జెట్లో అల్లుడు, కుమారుడి శాఖలకు ఎక్కువగా కేటాయింపులు చేశారని ఆయన ఆరోపించారు.
రైతులు, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ వైఖరి ఉందని, రూ. 16వేల కోట్లు మిగులు ఉన్నా కరెంటు కొనలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 300మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఏ మంత్రి కూడా పరామర్శించలేదని అన్నారు. మైనారిటీలకు, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.