ఎపి రాజధాని: చంద్రబాబు మాటే, షెడ్లు తయార్
హైదరాబాద్: అవసరమైతే షెడ్లు వేసుకుని వెళ్లిపోతామని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన నిజం కాబోతున్నట్లుంది. తొలి షెడ్డు సిఆర్డిఎ ఉద్యోగుల కోసం ఏర్పాటు కానుంది. ఇటీవల జరిగిన సిఆర్డిఎ కార్యవర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీని ఏర్పాటుచేసిన అనంతరం పెద్ద సంఖ్యలో డిప్యూటీ కలెక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులను సిఆర్డిఎలో నియమించారు. భూసేకరణ పనులు వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు. అయితే, వారు పనిచేసేందుకు సరైన స్థలం లేకపోవడంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక వసతి కల్పించుకునేందుకు నిర్ణయించారు.
దీనిపై ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్కల్లాం అధ్యక్షతన సిఆర్డిఎ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాత్కాలిక వసతి ఏర్పాటుచేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రాజధాని ప్రాంతంలో తొలి తాత్కాలిక నిర్మాణాలు ప్రారంభమైనట్టయింది.
ధరల అదుపునకు చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో తగ్గుతున్న భూముల ధరలను అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈమేరకు రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూముల రిజిసే్ట్రషన్లను నిలిపివేసింది. దీనికి సంబంధించి మంగళగిరి, తాడికొండ, గుంటూరు జిల్లాలోని పలు రిజిస్ర్టేషన్ కార్యాలయాలకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఎకరం ధర రూ. కోటి నుంచి కిందకి పడిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.