చంద్రబాబు ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఓకే: శిల్పా, అఖిలప్రియకు హ్యాపీ
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల సీటును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చినా తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని శిల్పా చక్రపాణి రెడ్డి సోమవారం అన్నారు.
మండలిలోని తన కార్యాలయంలో శిల్పా చక్రపాణి రెడ్డితో శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి ప్రమాణీస్వీకారం చేయించారు. ఆయన ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాట్లాడారు.
చంద్రబాబుకు థ్యాంక్స్
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని శిల్పా చెప్పారు. తనకు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
మధ్యవర్తిని మాత్రమే
నంద్యాల సీటు విషయంలో తాను మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించానని శిల్పా తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు.
టిక్కెట్ కోసం సర్వేలు
నంద్యాలలో గెలిచే అభ్యర్థి ఎవరు అనే దానిపై సర్వేలు చేయిస్తున్నారని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. దానిని బట్టి అధినేత నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కాగా, శిల్పా చక్రపాణి రెడ్డి వ్యాఖ్యలు టిక్కెట్ పైన ఆశలు పెట్టుకున్న అఖిలప్రియ ఫ్యామిలీకి సంతోషాన్ని కలిగించేవే.
భూమా ఫ్యామిలీ వర్సెస్ శిల్పా మోహన్ రెడ్డి
కాగా, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీగా ఏర్పడిన స్థానంలో భూమా, శిల్పా వర్గాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల సీఎం చంద్రబాబు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఇరువర్గాలతో చర్చలు జరిపారు.