హైద్రాబాద్కు శిల్పా.. వైసిపిలో చేరగానే, నంద్యాలలో టిడిపి-అఖిల చక్రం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మాజీ మంత్రి, నంద్యాల టిడిపి నేత శిల్పా మోహన్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు.
హైదరాబాద్/నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మాజీ మంత్రి, నంద్యాల టిడిపి నేత శిల్పా మోహన్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. ఆయన ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 11 గంటలకు జగన్ సమక్షంలో వైసిపిలో చేరనున్నారు.
చదవండి: చంద్రబాబు ప్రభుత్వంపై శిల్పా సంచలన వ్యాఖ్యలు
శిల్పా పెద్ద ఎత్తున తన కార్యకర్తలు, అనుచరులతో నంద్యాల నుంచి హైదరాబాద్ బయలుదేరారు. తాను వెళ్లిపోతే ఎలాంటి నష్టం లేదని చెబుతున్న తెలుగుదేశం పార్టీకి తన సత్తా ఏమిటో వైసిపిలో చేరే సమక్షంలోనే చాటాలని శిల్పా మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
చేరగానే అభ్యర్థిగా ప్రకటన?
శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరగానే అధినేత జగన్ ఆయనను నంద్యాల అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి మృతి చెంది మూడు నెలలు అవుతోంది. మరో మూడు నెలల్లో తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి. ఈ నేపథ్యంలో భూమా కుటుంబానికే ఇప్పుడు టిక్కెట్ దక్కనుంది. వారిని ఎదుర్కొనే సరైన వ్యక్తిగా శిల్పా అని వైసిపి భావిస్తోంది.
అప్రమత్తమైన అఖిల, టిడిపి
మరోవైపు, శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరినా తమకు ఎలాంటి నష్టం లేదని టిడిపి చెబుతోంది. కానీ లోలోన వారికి భయం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. తాను వైసిపిలో చేరుతానని సోమవారం శిల్పా ప్రకటించారు. వెంటనే తెలుగు తమ్ముళ్లు అప్రమత్తమయ్యారు.
శిల్పా వెంట వెళ్లకుండా పావులు
శిల్పా ప్రకటన నేపథ్యంలో పార్టీ అధిష్టానం అఖిలప్రియతో పాటు మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఇతర టిడిపి నేతలను రంగంలోకి దింపింది. వారు నంద్యాలలో స్థానిక టిడిపి నేతలతో సమావేశమయ్యారు. శిల్పా వెంట ఎక్కువ మంది వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. ఆ మేరకు పలువురిని మోటివేట్ చేశారని అంటున్నారు.
శిల్పా సోదరులు కడప జిల్లాకు చెందిన వారు
శిల్పా సోదరులు కడప జిల్లాకు చెందిన వారు. వ్యాపారం నిమిత్తం కర్నూలు జిల్లాకు వచ్చి నంద్యాలలో స్థిరపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సత్సంబంధాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి టిడిపిలో ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో నంద్యాల స్థానం నుంచి శిల్పా మోహన్ రెడ్డి గెలిచారు. 2009లో వైయస్ కేబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. ఈ క్రమంలో వైయస్ కుటుంబంతో పాటు జగన్తోను సత్సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత రాజకీయ సమీకరణంలో భాగంగా టిడిపిలో చేరారు. ఇప్పుడు వైసిపిలో చేరుతున్నారు.
వీరు శిల్పా వెంటే
శిల్పా మోహన్ రెడ్డి వెంటే పలువురు నేతలు వైసిపిలో చేరనున్నారు. మార్క్ ఫెడ్ ఉపాధ్యక్షులు పిపి నాగిరెడ్డి తదితరులు ఆ పార్టీలో చేరనున్నారు. రెండేళ్లుగా ఎన్నో అవమానాలకు గురయ్యానని, అధి నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని నాగిరెడ్డి విమర్శించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దేశం సులోచన కూడా భూమా వర్గం చేరాకే టిడిపిలో సమస్యలు మొదలయ్యాయని చెప్పారు. కలుపుకొని వెళ్దామన్నా ప్రత్యర్థి వర్గం సహకరించలేదన్నారు. నంద్యాల నుంచే టిడిపి పతనం మొదలయిందని శిల్పా వర్గీయులు అంటున్నారు.