బాబు 'సర్వే' రివర్స్: జగన్ ఎదుట శిల్పా ఇలా.., అఖిలప్రియకు చెక్
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి విషయమై తేల్చకపోవడం వల్ల తాను పార్టీ వీడుతున్నట్లు శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు.
కర్నూలు: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి విషయమై తేల్చకపోవడం వల్ల తాను పార్టీ వీడుతున్నట్లు శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. దాంతో పాటు శిల్పా, వైసిపి అధినేత జగన్ మరికొన్ని లెక్కలు వేసుకున్నారని తెలుస్తోంది.
బాబు ఆదేశం, రంగంలోకి మంత్రులు: జగన్కు మాటిచ్చానని శిల్పా
భూమా నాగిరెడ్డి మృతి తర్వాత నంద్యాల రాజకీయాలు ఆసక్తిగా మారాయి. శిల్పా వైసిపిలో చేరి, పోటీ చేస్తే జగన్ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కతోనే వైసిపిలో చేరేందుకు శిల్పా, చేర్చుకునేందుకు జగన్ సిద్ధమయ్యారట.
చంద్రబాబు సర్వే.. మొదటికే మోసం తెచ్చిందా?
నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి లేదా శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు సర్వే చేశారు. ఈ సర్వే ఆధారంగా టిక్కెట్ ఇస్తానని చెప్పారు. కానీ ఇందులో ఇరువర్గాలకు దాదాపు సమాన ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టిక్కెట్ ఎవరికివ్వాలనే అంశంపై చంద్రబాబు డైలమాలో పడ్డారు. ఓ నిర్ణయానికి రాలేకపోయారని అంటున్నారు.
పోటా పోటీ ఉండటంతో...
సర్వేలో నియోజకవవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఇటు భూమా కుటుంబానికి, అటు శిల్పాకు దాదాపు సమానంగా మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో సానుభూతి ఆధారంగా లేదా ఇప్పటికే హామీ ఇచ్చినందున భూమా కుటుంబానికి టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపించాయని అంటున్నారు. దీనిని గుర్తించే శిల్పా పార్టీ మారేందుకు సన్నద్ధమయ్యారని చెబుతున్నారు.
సర్వే లెక్కలతో...
చంద్రబాబు చేసిన సర్వేలో భూమా కుటుంబానికి తాను ఏమాత్రం తీసిపోలేదని శిల్పా గుర్తించారని, అలాగే, తనకు టిక్కెట్ రాదని తెలుసుకున్నారని, దీంతో వైసిపిలో చేరి టిక్కెట్ దక్కితే తన వర్గం మొత్తం తనతో ఉంటుందని, అప్పుడు వైసిపి తోడై తాను సులువుగా గెలుస్తానని శిల్పా మోహన్ రెడ్డి అంచనా వేశారని అంటున్నారు. ఇన్నాళ్లు వేచి చూసినా చంద్రబాబు నుంచి సానుకూల స్పందన లేదు. దీంతో టిక్కెట్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. తీరా ఎన్నికలకు ముందు వైసిపిలో చేరితే అక్కడ కుదురుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది.
బాబుకు టైమిచ్చి.. శిల్పా ముందు జాగ్రత్త
అందుకే శిల్పా.. చంద్రబాబుకు కావాల్సినంత సమయం ఇచ్చి, అలాగే తన రాజకీయ భవిష్యత్తు కోసం ముందుజాగ్రత్తతో వ్యవహరించి, ముందుగానే వైసిపిలో చేరుతున్నారని అంటున్నారు. అలాగే, చంద్రబాబు చేసిన సర్వే లెక్కలు జగన్ ఎదుట కూడా పెట్టారని తెలుస్తోంది. తనకు టిక్కెట్ ఇస్తే గెలుపు సులువు అవుతుందని కూడా వైసిపి అధినేతకు శిల్పా చెప్పారని తెలుస్తోంది.
భూమా ఫ్యామిలీ మెంబర్ను ఓడించి జగన్కు కానుక!
జిల్లాలో తనకు కీలక నేతగా భావించిన భూమా నాగిరెడ్డి, ఆయన ఫ్యామిలీ టిడిపిలో చేరడాన్ని జగన్ ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు. మిగతా నేతలు వెళ్లడం కంటే.. భూమా ఫ్యామిలీ వెళ్లడాన్ని జగన్ చాలా సీరియస్గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తన పార్టీ నుంచి అభ్యర్థి ఎవరైనా నంద్యాలలో భూమా ఫ్యామిలీకి చెక్ చెప్పాలని జగన్ భావిస్తున్నారు. అందుకే శిల్పాను చేర్చుకొని ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. తద్వారా భూమా ఫ్యామిలీపై ప్రతీకారం తీర్చుకోవచ్చునని భావిస్తున్నారట.
వైసిపి ఇంచార్జితో ఇబ్బందులు..
ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి నుంచి కూడా పోటీకి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ప్రధానంగా నియోజకవర్గ ఇంచార్జిగా రాజగోపాల్ రెడ్డితో ఇబ్బంది. తనకు టిక్కెట్ రాకుంటే ఆయన అలకవహించడం ఖాయం. కానీ జగన్ బుజ్జగిస్తే ఆయన చల్లబడతారని అంటున్నారు. శిల్పా కూడా రాజగోపాల్ రెడ్డితో కలిసి పని చేసేందుకు సిద్ధమని చెబుతున్నారు. మొత్తానికి నంద్యాలలో భూమా కుటుంబ సభ్యుడిని ఓడించి.. తమ పార్టీ సీటును కాపాడుకోవాలని జగన్ భావిస్తున్నారు.