చిన్నపిల్లని మంత్రిగా చేస్తే..: అఖిలప్రియపై శిల్పా, ఆ దూకుడు వల్లే..
భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కూతురు అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను సంప్రదించారని వైసిపిలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు.
నంద్యాల: భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కూతురు అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను సంప్రదించారని వైసిపిలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు.
వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి
అఖిలప్రియకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు చెప్పినప్పుడు తాము ఏమీ అనలేదన్నారు. వయస్సులో తమ కంటే చిన్నపిల్లలైన కొందరిని కేబినెట్లోకి తీసుకున్నారని, అయితే మంచికే అనుకున్నామని శిల్పా చెప్పారు. కానీ వాళ్లు స్థానిక నేతలను పట్టించుకోలేదన్నారు.
అఖిలప్రియ ఎవర్నీ లెక్క చేయలేదని..
ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు.. ఇలా ఎవ్వరినీ లెక్క చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపిచారు. దీంతో స్థానిక నాయకత్వంలో తీవ్ర అసంతృప్తి రగిలిందని, సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఎన్నిసార్లు తీసుకు వెళ్లినా స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వందలసార్లు మొరపెట్టుకున్నా
భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, పరిస్థితి చేయిదాటడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశానని, వందలసార్లు మొరపెట్టుకున్నా ఆయన తమను పట్టించుకోలేదని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. కనీసం పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల సమస్యలు అయినా తీర్చమని అడిగినా ఫలితం లేకుండా పోయిందని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు.
అవి బాధించాయి
తమ పట్ల టిడిపి అధిష్టానం నిర్లక్ష్యధోరణితో వ్యవహరించిందని, దీంతో విసిగిపోయామని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. ఫరూఖ్, అఖిలప్రియలు తమకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నా చంద్రబాబు స్పందించకపోవడం బాధించిందని చెప్పారు.
అఖిలప్రియ దూకుడే ఇబ్బంది పెట్టిందని..
మొత్తానికి శిల్పా మోహన్ రెడ్డి మాటల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా అఖిలప్రియ దూకుడే ఇరకాటంలో పడేసినట్లుగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో శిల్పా మోహన్ రెడ్డిని మొత్తంగా కార్నర్ చేసేందుకు అఖిల ప్రయత్నించారు. ఈ కారణంతో వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. అఖిలప్రియ ఇలా దూకుడుతో వెళ్తే.. నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్, 2019లో టిక్కెట్ మాత్రమే కాకుండా తన రాజీకయ భవిష్యత్తుకే ఇబ్బందులు వస్తాయని శిల్పా మోహన్ రెడ్డి ఆందోళన చెందినట్లుగా కనిపిస్తోంది.