చంద్రబాబుకు షాక్: సెక్షన్ 8పై వివాదానికి తెర దించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, మంత్రులకు షాక్ ఇస్తూ కేంద్రం సెక్షన్ 8పై చెలరేగుతున్న వివాదానికి తెర దించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ నరసింహన్కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టడానికి సంబంధించిన ప్రక్రియకు కేంద్ర హోం శాఖ తెరదించింది. దీంతో హైదరాబాదులో శాంతిభద్రతల వ్యవహారాలను తెలంగాణ ప్రభుత్వమే చూసుకుంటుంది.
రాజ్యాంగం, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హైదరాబాదులో శాంతిభద్రతలు కాపాడుతామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిరుడు జూన్లో పంపించిన మార్గదర్శకాల వ్యవహారానికి అప్పుడే తెరదించామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరీభాయి పార్థ్భీయి చౌదరి స్పష్టం చేశారు.
హరీభాయ చౌదరి ఈ నెల 16న తెలంగాణ కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డికి రాసిన లేఖలో ఈ విషయం వివరించారు. పాల్వాయి గోవర్దన్ రెడ్డి రాజ్యసభలో ఈ అంశంపై చేసిన ప్రత్యేక ప్రస్తావనకు చౌదరి ఈ లేఖ రాశారు. గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కల్పించేందుకు బిజినెస్ ట్రాన్సాక్షన్ నియమాలను సవరించటం ద్వారా కామన్ పోలీసు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి పంపించిన మార్గదర్శకాల్లో సూచించింది.
హైదరాబాదు శాంతిభద్రతల నిర్వహణ, పోలీసు అధికారుల నియామకం, బదిలీలతోపాటు నేర దర్యాప్తుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించే అధికారాన్ని గవర్నర్కు బదిలీ చేసేందుకు కేంద్రం ఈ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వానికి పంపించింది. అయితే శాంతిభభద్రతలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాబట్టి గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కల్పించటం చట్ట విరుద్ధమని పాల్వాయి గోవర్దన్ రెడ్డి తమ ప్రత్యేక తీర్మానంలో వాదించారు. రాష్ట్ర విభజన చట్టంలో సూచించిన సెక్షన్ 8 ప్రకారం గవర్నర్కు ప్రత్యేక అధికారాలపై కేంద్ర హోం శాఖ తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది
దీనికి తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగంతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చిందని హరిభాయి పార్థ్భీయి చౌదరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి తెర దించినందున తెలంగాణ ప్రభుత్వానికి గత సంవత్సరం జూన్ 4న జారీ చేసిన మార్గదర్శకాలను ఉపసంహరించుకోవలసిన అవసరం ఇక లేదని కేంద్ర మంత్రి ఆ లేఖలో స్పష్టం చేశారు.