2019 షాక్: కేశినేని నానికి షాక్, బాబుతో లగపాటి భేటీ వెనుక.. ఏం జరుగుతోంది?
బెజవాడ రాజకీయాల్లో.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? కేశినేని నానిపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారా? వచ్చే ఎన్నికల్లో మాజీ ఎంపీ లగడపాటి తెరపైకి రానున్నారా
విజయవాడ: బెజవాడ రాజకీయాల్లో.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? కేశినేని నానిపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారా? వచ్చే ఎన్నికల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెరపైకి రానున్నారా?
ఏపీలో కీలక మలుపులు చోటు చేసుకోనున్నాయా?: కారణాలివే!
ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు చాలామందిని వేధిస్తున్నాయి. చంద్రబాబును లగడపాటి రాజగోపాల్ శుక్రవారం వెలగపూడి సచివాలయంలో కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇది మర్యాదపూర్వక భేటీయేనని లగడపాటి చెప్పినప్పటికీ ఆసక్తిని రేపుతోంది.
లగడపాటి తెలుగుదేశం పార్టీలో చేరుతారా? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు బెజవాడ పార్లమెంటు టిక్కెట్ ఆయనకు ఇస్తారా? కేశినేని నానిని పక్కన పెడుతారా? అనే చర్చ సాగుతోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందువల్లే లగడపాటి భేటీపై చర్చ సాగుతోంది.
లగడపాటి ఎంట్రీకి సమయం వచ్చిందా?
రాష్ట్రం విడిపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజనకు ముందు సవాల్ చేశారు. ఆయన అన్నట్లుగానే ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. 2014లో పోటీ చేయలేదు. అడపా దడపా ఆయన బయట కనిపించారు.
రాజకీయాల్లోకి వస్తారా అంటే... ఆయన నుంచి సమాధానం లేదు. సమయం వచ్చినప్పుడు అన్నట్లు మాట్లాడేవారు. అయితే, ఆ సమయం ఇప్పుడు వచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
కేశినేని నానికి చెక్.. లగడపాటి తెరపైకి వచ్చారా?
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే లగడపాటి తెరపైకి వచ్చారా అనే చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ద్వారా లగడపాటి రాజకీయాల్లోకి మళ్లీ ఆరంగేట్రం చేయనున్నారా అనేది కొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది.
బెజవాడ నుంచి పోటీ చేస్తారా?
2019లో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి రప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే వైసిపి నుంచి 21 మంది ఎమ్మెల్యేలు వచ్చారు.
ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో బలం ఉన్న నాయకులపై చంద్రబాబు దృష్టి సారించారు. బెజవాడలో కేశినేని నానని తీరుపై సంతృప్తిగా లేని చంద్రబాబు 2019 ఎన్నికల్లో లగడపాటికి టిక్కెట్ ఇచ్చే వ్యూహరచన చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
బాబు ఒప్పిస్తున్నారా.. లగడపాటి వస్తున్నారా?
లగడపాటి రాజగోపాల్కు వ్యాపారాలు ఉన్నాయి. ఇందులో భాగంగా కూడా కలిసి ఉండవచ్చునని అంటున్నారు. అయితే, రాజకీయ ప్రాధాన్యతను కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు. అదే నిజమైతే బెజవాడ నుంచి రంగంలోకి దింపేందుకు చంద్రబాబు ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారా లేక తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు లగడపాటి టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారా? మొత్తానికి ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు.
కేశినేని నానిపై చంద్రబాబు అసంతృప్తి
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన వ్యవహారశైలి పార్టీకి ఇబ్బంది తీసుకు వస్తుందని అంటున్నారు. గతంలో ప్రత్యేక హోదా విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి మొదలు నిన్నటి రవాణా శాఖ కార్యాలయం సంఘటన వరకు కేశినేని నానిపై అధిష్టానం అంత సానుకూలంగా లేదని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ నుంచి రవాణా శాఖ కార్యాలయం దాకా..
గతంలో హోదా విషయంలో పవన్ కళ్యాణ్ టిడిపి ఎంపీలను నిలదీశారు. కేశినేని నాని వంటి వారు వ్యాపారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. దీనిపై కేశినేని గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ను ఏమీ అనవద్దని చంద్రబాబు క్లాస్ తీసుకోవడంతో ఆయన మౌనం పాటించారు.
ఇటీవల రవాణా శాఖ కార్యాలయం గందరగోళం చోటు చేసుకుంది. నాని, బోండా ఉమలు అధికారులతో అనుచితంగా ప్రవర్తించినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఆ తర్వాత చంద్రబాబు క్లాస్ తీసుకోవడంతో కేశినేని, బోండాలు అధికారులకు క్షమాపణ చెప్పారు. ఇలా నేతల తీరుతో చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
చంద్రబాబు మాట కాదని..
తాను నిజాయితీగా ట్రావెల్స్ నడుపుతున్నానని, ఇతరుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నది కేశినేని నాని వాదన. ట్రావెల్స్ ఇబ్బందుల నేపథ్యంలో తన బాధ చంద్రబాబుకు కూడా తెలియాలనే ఉద్దేశ్యంతోనే కేశినేని నాని కొద్ది రోజుల క్రితం ట్రావెల్స్ రద్దు ప్రకటన చేయాలనుకున్నారట. చంద్రబాబు ఫోన్ చేయడంతో ఆగిపోయారు. ఆ తర్వాత మళ్లీ కొద్ది రోజులకే ట్రావెల్స్ను ఆపేస్తున్నట్లు ప్రకటన చేశారు.
అంతర్గంతంగా ఏమైనా జరుగుతోందా?
తాజాగా, కేశినేని నాని మాట్లాడుతూ.. నిజాయితీగా వ్యాపారం చేస్తుంటే తనపై దొంగగా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ వ్యాపారం చేయకూడదని నిర్ణయించుకున్నానని, ట్రావెల్స్ వ్యాపారంలో గత రెండేళ్లుగా నష్టాలు వస్తున్నాయని, నష్టాలు వచ్చాయని ట్రావెల్స్ మూసివేయలేదని, సురక్షితమైన ప్రయాణానికి కేశినేని ట్రావెల్స్ పెద్దపీట వేస్తుందన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి ట్రావెల్స్ వ్యాపారం చేయాలని ఆహ్వానాలు వస్తున్నాయని, పార్టీకి, సీఎంకు చెడ్డపేరు రాకూడదనే బస్సులు నిలిపి వేశానని చెప్పారు. అయితే, తాజాగా లగడపాటి భేటీ, చంద్రబాబు చెప్పినా వినకుండా ట్రావెల్స్ మూసివేత ప్రకటన నేపథ్యంలో.. అంతర్గతంగా ఏదో జరుగుతోందా అనే చర్చ సాగుతోంది.