తెలుగు రాష్ట్రాల ట్రావెల్స్కు అరుణాచల్ షాక్: 900 బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు
తెలుగు రాష్ట్రాల ప్రైవేటు బస్సుల యాజమాన్యాలకు అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. అరుణాచల్ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని పూర్తిగా ఇతర రాష్ట్రాల్లోనే తిరుగుతున్న టూరిస్టు బస్సులు/స్లీపర్ కోచ్
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రైవేటు బస్సుల యాజమాన్యాలకు అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. అరుణాచల్ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని పూర్తిగా ఇతర రాష్ట్రాల్లోనే తిరుగుతున్న టూరిస్టు బస్సులు/స్లీపర్ కోచ్ల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 900 వరకు ఆపరేటర్ల బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలకు చెందిన ఆపరేటర్లు దాదాపు 2500 బస్సులను అరుణాచల్ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కేంద్ర మోటారు వాహన చట్టం నిబంధనల ప్రకారం ఈ బస్సుల ప్రారంభ స్థానంగాని, గమ్యస్థానంగాని రిజిస్ట్రేషన్ చేసుకున్న రాష్ట్రంలో ఉండాలి.
కాగా, అరుణాచల్ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఆపరేటర్ల బస్సులేవీ ఆ రాష్ట్రానికి వెళ్లవు. దీనిపై అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వానికి కొన్ని రోజులుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం కొందరు ఆపరేటర్లకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
ఇప్పుడు పూర్తిగా అలాంటి బస్సుల రిజిస్ట్రేషన్లే రద్దు చేస్తూ ఆ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జూన్ 6న ఉత్తర్వులు జారీ చేశారు.అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోని బస్సుల ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ బస్సుల్లో స్లీపర్బెర్త్లకు సంబంధించి అడ్డం బెర్త్ల (1+1) లేఅవుట్లకు మాత్రమే అనుమతి ఉంది. ఈ విధానంలో ఒక బస్సులో 24 బెర్త్లే వస్తాయి.
అరుణాచల్ప్రదేశ్, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో నిలువు బెర్త్లు (2+1) లేఅవుట్కు అనుమతి ఉంది. దీనివల్ల ఒక్కో బస్సులో 12 బెర్త్లు అదనంగా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇది లాభసాటిగా ఉండటంతో గడిచిన మూడు నాలుగేళ్లలో ప్రతి కొత్త స్లీపర్ బస్సు అరుణాచల్ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న రిజిస్ట్రేషన్ల రద్దు నిర్ణయంతో ఈ ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు సందిగ్ధంలో పడ్డారు.