టీడీపికి షాక్: పశ్చిమ రాయలసీమ 'పట్టభద్రుల ఎమ్మెల్సీ' వైసీపీదే..
పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను పక్కనబెడితే మొత్తం పోలైన ఓట్లను 1,35,772గా నిర్దారించారు. ఇందులో మ్యాజిక్ ఫిగర్ 67,882ఓట్లు కావడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గోపాల్ రెడ్డి మ్యాజిక్ ఫిగర్ .
అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ పైచేయి సాధించింది. వైసీపీ అభ్యర్థి గోపాల్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై 14,146ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గోపాల్ రెడ్డికి 53, 714 ఓట్లు దక్కగా.. కేజేరెడ్డికి 41,307ఓట్లు , గేయానంద్ కు 32,810ఓట్లు దక్కాయి.
పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను పక్కనబెడితే మొత్తం పోలైన ఓట్లను 1,35,772గా నిర్దారించారు. ఇందులో మ్యాజిక్ ఫిగర్ 67,882ఓట్లు కావడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గోపాల్ రెడ్డి మ్యాజిక్ ఫిగర్ దక్కించుకున్నారు. గెలుపుపై సంతోషం వ్యక్తం చేసిన గోపాల్ రెడ్డి.. ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికుల సమస్యల పోరాటానికి రాజీలేని పోరాటం చేస్తానని అన్నారు. ప్రజాక్షేత్రంలో వైసీపీకి ఉన్న మద్దతు వల్లే తన విజయం సాధ్యపడిందన్నారు.
ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికొస్తే.. రాయలసీమలో టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది. తూర్పు రాయలసీమ( చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం), పశ్చిమ రాయలసీమ(అనంతపురం, కడప, కర్నూలు) నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు పరాభవం తప్పలేదు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసిన టీడీపీకి టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడిపోయింది.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి వైసీపీ మద్దతుతో నిలబడిన పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి గెలుపొందారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పీవీఎస్ మాధవ్ విజయం సాధించారు. ప్రత్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి అజా శర్మపై 9215 ఓట్ల తేడాతో విజయం సాధించారు.