20 రోజుల తర్వాత తల్లి ఒడికి చేరిన ఎస్సై సిద్ధయ్య కుమారుడు (ఫొటో)
హైదరాబాద్: అన్న వాహికకు రంధ్రం, ఉపిరితిత్తుల సమస్యతో జన్మించిన ఎస్సై సిద్దయ్య కొడుకు 20 రోజుల తర్వాత తల్లి ఒడికి చేరాడు. చిన్నారి ఆరోగ్యం పూర్తిగా కుదుట పడడంతో తల్లికి అప్పగించారు. కొడుకును ఒడిలోకి తీసుకుని ధరణీష ఉద్వేగానికి గురయ్యారు.
పరిస్థితి కుదుటపడటంతో సోమవారం రెయిన్బో ఆసుపత్రి డాక్టర్లు ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. సిమీ తీవ్రవాదుల వేటలో తీవ్రంగా గాయపడిన సిద్దయ్య ఆసుపత్రిలో చేరిన రోజే ఆయన భార్య ధరణీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఆపరేషన్, 20 రోజుల చికిత్స తర్వాత చిన్నారి పూర్తిగా కోలుకోవటంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. సిద్ధయ్యను బ్రతికించడానికి వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
నల్గొండ జిల్లాలోని జానకీపురం వద్ద సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలుపాలై హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్ఐ సిద్ధయ్య మృతి చెందాడు. మంగళవారం ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 4.06 నిమిషాలకు సిద్ధయ్య తుది శ్వాస విడిచాడు.