బిజెపి వల్లే ఓడిపోయా, నేను కూడా చేశా: అఖిలకు శిల్పా కౌంటర్
తాను కూడా నంద్యాలను అభివృద్ధి చేశానని మాజీ మంత్రి, వైసిపి నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన మంత్రి అఖిలప్రియకు కౌంటర్ ఇచ్చారు.
కర్నూలు: తాను కూడా నంద్యాలను అభివృద్ధి చేశానని మాజీ మంత్రి, వైసిపి నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన మంత్రి అఖిలప్రియకు కౌంటర్ ఇచ్చారు.
పార్టీలకు అతీతంగా భూమా నాగిరెడ్డి సేవలను, అభివృద్ధిని వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకుని ఎన్నికలు ఏకగ్రీవం చేయాల్సిన బాధ్యత వైసిపికి ఉందని అఖిల ప్రియ తెలిపారు.
దీనిపై శిల్పా స్పందించారు. అధికార పార్టీ నేతలు కోరుతున్నట్లు ఏకగ్రీవం అసాధ్యమని తేల్చి చెప్పారు. నంద్యాలను ఎవరో ఒకరు అభివృద్ధి చేయలేదని, తాను కూడా చేశానని ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
బాబుకు వైసిపి షాక్, జగన్ పార్టీతో మాట్లాడుతానని అఖిలప్రియ
నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పారు. అధికారం, డబ్బుతో తెలుగుదేశం పార్టీ గెలవాలనుకుంటోందని ఆరోపించారు.
టిడిపి అధికారం, డబ్బు ఉపయోగించాలనుకున్న ప్రజలు మాత్రం తన వైపు ఉన్నారని చెప్పారు. టిడిపి - బిజెపి పొత్తు వల్లే తాను 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయానని ఆసక్తికర ప్రకటన చేశారు.
పొత్తు కారణంగా తన నియోజకవర్గంలో నిర్ణయాత్మక ఓటు బ్యాంకును కలిగి ఉన్న ముస్లీం ఓటర్లు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారని, అదే తన ఓటమికి కారణమైందని తెలిపారు.