గెలుస్తా కానీ: శిల్పా, టిడిపి ఓడితే బాబుకు ఇక ఇబ్బందులే: కొడాలి నాని
నంద్యాల ఉపఎన్నికలో తన గెలుపు ఖాయమని వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నంద్యాల: నంద్యాల ఉపఎన్నికలో తన గెలుపు ఖాయమని వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం మాట్లాడారు. వైసిపికి ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు.
ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని, అయితే ఎంత మెజారిటీతో విజయం సాధిస్తాననే విషయం ఇప్పుడే చెప్పలేనన్నారు.
శిల్పాకు వరుసగా మద్దతు
కాగా, వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాల పట్టణ ఆర్యవైశ్యులు శనివారం మద్దతు ప్రకటించారు. తాజాగా అక్కినేని అభిమానులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. శిల్పా మోహన్ రెడ్డికి ఆలిండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవీ రామరాజు ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.
చంద్రబాబుకు ఇబ్బందే: కొడాలి నాని
నంద్యాల ఉపఎన్నికలో టిడిపి ఓడిపోతే చంద్రబాబుకు, ఆయన పార్టీకి, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని వైసిపి ఎమ్మెల్యేకొడాలి నాని జోస్యం చెప్పారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చిన్నపిల్లాడేం కాదు
చంద్రబాబు ఏమీ చిన్నపిల్లాడు కాదు, చంటిపిల్లాడు కాదని, నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని, నంద్యాల నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఆయనకు పూర్తిగా తెలుసని కొడాలి నాని అన్నారు.
రిగ్గింగ్ చేసిన అయినా గెలవాలని
కాబట్టి, ధనబలాన్ని, కండబలాన్ని,అధికార బలాన్ని ఉపయోగించుకుని అవసరమైతే రిగ్గింగ్ చేసి అయినా సరే, ఇక్కడ గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.
శిల్పా గెలిచాకనే
2004లో ఈ ప్రాంతంలో శిల్పా మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారని, చంద్రబాబు ఇప్పుడు వచ్చి తాను మూడేళ్లుగా ఏదో పగలదీస్తున్నానని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు ఒకటే ప్రశ్న
గతంలో శిల్పా మోహన్ రెడ్డి మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏమాత్రం అభివృద్ది పనులు చేయలేదని చెబుతున్న చంద్రబాబును తాను ఒకటే అడుగుతున్నానని, అంతకుముందు పది సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు, మంత్రి ఫరూక్ ఏం చేశారు? గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా? అని నిలదీశారు.