నయీం భూ దందాలో కొత్తకోణం: బెదిరించి అర్ధరాత్రి భూముల రిజిస్ట్రేషన్లు
అమరావతి: గ్యాంగ్ స్టర్ నయీం విశాఖ లింకులపై సిట్ బృందం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నయీం కేసులో రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలకు ఉచ్చు బిగుస్తోంది. అర్ధరాత్రి సమయాల్లో భూములను రిజిస్ట్రేషన్లు చేసినట్లు సిట్ అధికారులు పక్కా ఆధారాలను సేకరించారు.
ఈ అంతుచిక్కని క్రూరమైన హత్యల వెనుకా నయీమ్ హస్తం?
దీంతో ఆయా శాఖలకు చెందిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు ఆఫీసుల్లో కాకుండా ప్రైవేట్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా సిట్ అధికారులకు పక్కా ఆధారాలు లభించాయి. త్వరలోనే ఈ శాఖలకు సంబంధించిన అధికారులకు సిట్ నోటీసులు జారీ చేయనుంది.
హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నంలలో భార్యతో పాటు సోదరి పేరిట భారీగా ఆస్తులను గుర్తించారు. 1500 ఎకరాల్లో వెయ్యి ఎకరాలను డాక్యుమెంటరరీ రూపంలో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నయీంకు మొత్తం 40 ఇళ్లు ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 31 ఇళ్లను సిట్ అధికారులు గుర్తించారు.
విశాఖపట్నంలో బాకీ వసూలు చేసేందుకు ఓ ఫైనాన్షియిర్ గ్యాంగ్ స్టర్ నయీం సాయం తీసుకున్నట్టుగా తెలిసింది. అంతేకాదు విశాఖపట్నంలో పెద్దమొత్తంలో డీల్స్ కోసం నయీం స్వయంగా రంగంలోకి దిగినట్టు సిట్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఇప్పటి వరకు నయీం వ్యవహారంలో 39 కేసులు పెట్టారు.
ఒక్క మంగళవారమే పది నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అందులో నలుగురిని భువనగిరిలో, ఆరుగురిని నల్గొండలో అరెస్ట్ చేశారు. భువనగిరిలో కత్తుల జంగయ్య, పులి నాగరాజు, గుర్రం శివరాజు, బచ్చు నాగరాజులను అరెస్ట్ చేయగా, నల్గొండలో సయ్యద్ అన్సారుల్లా గౌరి, సయ్యద్ అజీజ్, మహ్మద్ జైబుద్దీన్, షేక్ అబ్దుల్లా, మహ్మాద్ తర్బాజ్, మహ్మాద్ మోబీన్ అరెస్ట్ చేశారు.
మరోవైపు పాశం శ్రీనుపై భువనగరి వ్యాపారి శ్రీధర్ ఫిర్యాదు మేరకు సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత కోర్టులో హాజరు పరిచి కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక, నయీం భార్య హసీనా, అతడి సోదరి సలీమా బేగంను విచారించేందుకు నార్సింగ్ పోలీసులు వేసిన పీటీ వారెంట్ పిటిషన్పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
అతని పురుషాంగాన్ని కోసేయ్: నయీమ్, దేశంలో 29 అడ్డాలు, భార్యే కీలకం
నయీం భూదందా కేసులో ఈ నెల 9న హసీనా, సలీమా బేగంను షాద్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ నయీం కుటుంబ సభ్యులు కావడంతో అల్కాపూర్ టౌన్షిప్లో లభ్యమైన మారణాయుధాలు, నగదుతో పాటు హత్యలకు సంబంధించిన అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
వీరిద్దర్నీ నార్సింగ్ ప్రాంతంలో నయీం అరాచకాలు, భూదందాలపై విచారించేందుకు, వారిని షాద్నగర్ నుంచి నార్సింగ్ రప్పించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.