సిఎం స్వయంగా: బాబుపై ఏచూరి, ట్విట్టర్ బాబు అంటూ లోకేష్పై గట్టు
హైదరాబాద్: శాసనసభ్యులతో బేరసారాల్లో స్వయంగా ముఖ్యమంత్రే పాలు పంచుకోవడంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సిపిఎ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. నోటుకు ఓటు కేసుపై ఆయన బుధవారం ఈ డిమాండ్ చేశారు. ఇటువంటి తప్పు మరోటి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
నోటుకు ఓటు కేసులవో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలతో అనైతిక కార్యకలాపాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు తెలంగాణ టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పట్టుబడడంపై, స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేప్ విడుదల కావడంపై ఆయన స్పందించారు.
హెరిటేజ్ సంస్థకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఆ నిధులు ఎలా సమకూర్చాలో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో తప్ప ఎక్కడా కనిపించడం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
ఇరు రాష్ట్రాల ప్రజలకు పలు అంశాల్లో చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబును చూస్తే తెలంగాణలో ఎలుక పిల్ల కూడా భయపడదని రామచంద్ర రావు అన్నారు. లోకేష్, ఆయన తండ్రి చంద్రబాబుకు తెలంగాణలో ఎవరూ భయపడరని రామచంద్రరావు అన్నారు. టీ టీడీపీ నేతల తీరును చూసి తెలంగాణ ప్రజలు అస్యహించుకుంటున్నారని మండిపడ్డారు.
రేవంత్కు బెయిల్ వస్తే టీ టీడీపీ నేతలు సిగ్గు లేకుండా సంబురాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. రేవంత్ ఏం సాధించారని సంబురాలు చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్కు బెయిల్ వస్తే సీమాంధ్రలో స్వీట్లు పంచుకుంటున్నారని అన్నారు. రేవంత్ ఎవరికి ఊడిగం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. టీడీపీ తెలివైన దొంగల పార్టీ అని విమర్శించారు.