స్మితా సబర్వాల్: 'ఔట్లుక్పై కేసు నమోదుకు ఆదేశాలివ్వండి'
హైదరాబాద్: ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్తో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన అభ్యంతకర కథనాలు ప్రచురించిన ఔట్లుక్ పత్రిక పైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది సుంకరి జనార్ధన్ గౌడ్ బుధవారం హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ నాన్ జ్యుడీషియరీ సభ్యుడు కాకుమాను పెదపేరి రెడ్డి ఈ నెల 28వ తేదీలోగా విచారణ నివేదికను కమిషన్కు అందజేయాలని నగర పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు.
ఔట్లుక్ పత్రికలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సహాయ కార్యదర్శిగా పని చేస్తున్న అధికారిణి స్మితా సబర్వాల్పై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్గ సహచరులను వీక్షకులుగా కార్టూన్ వేసి అవమానించారని ఫిర్యాదులో జనార్దన్ గౌడ్ పేర్కొన్నారు.
హెచ్చార్సీలో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఔట్లుక్ ఎడిషన్లో ప్రచురితమైన డీప్త్రోట్ కాలంలో తెలంగాణ నో బోరింగ్ బాబు అంటూ అనేక అభ్యంతరకర వ్యాఖలు చేశారన్నారు. జూనియర్ ఐఏఎస్ అధికారిణిని సీఎం కార్యాలయంలో అతి ముఖ్యమైన పదవిలో నియమించడం ఒక మిస్టరీ అని, ఐఏఎస్ అధికారిణి ఇటీవల జీన్స్, టీ షర్టు వేసుకుని ఫ్యాషన్ షోలో క్యాట్వాక్ చేస్తూ అబ్బురపరిచిందని కథనంలో పేర్కొనడం హేయమైన చర్య అన్నారు.
వీక్షకుల స్థానంలో సీఎంను, ఆయన సహచరులను, వారి చేతుల్లో కెమెరాలు పెట్టి కార్టూన్ గీసి అవమానపరిచారన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరినట్లు తెలిపారు.