'చంద్రబాబును దోషిగా!, వైఎస్ వల్లే కాలేదు.. జగన్ తో ఏమవుతుంది?'
నెల్లూరు : యువభేరి సభల ద్వారా ప్రత్యేక హోదాపై టీడీపీ వైఖరిని ఎండగడుతోన్న ప్రతిపక్ష నేత జగన్ పై అధికార పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ నిర్వహిస్తోన్న యువభేరి సభలను హాస్యాస్పదం అని పేర్కొంటూ జగన్ రాజకీయాలపై పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి.
శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన సందర్బంగా.. జగన్ గురించి ప్రస్తావించిన సోమిరెడ్డి.. 11 కేసుల్లో నిందితుడయిన జగన్ యువభేరీ సభలో ప్రసంగిస్తూ సీఎం అవుతానని చెప్పుకోవడం సిగ్గుచేటు వ్యవహారమన్నారు. కేవలం యుతను రెచ్చగొట్టేందుకు జగన్ సభలు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోని జగన్, హోదా కోసం సభలు నిర్వహించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
ఇక సీఎం చంద్రబాబును కేసుల్లోకి లాగాలని జగన్ చేస్తోన్న ప్రయత్నాలన్ని వృధా ప్రయాసలేనని అభిప్రాయపడ్డ సోమిరెడ్డి.. 'చంద్రబాబును దోషిగా నిలబెట్టడం వైఎస్ రాజశేఖర్రెడ్డి వల్లే కాలేదని, ఇక జగన్ వల్ల ఏమమవుతుందని?' అని చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతగానో తోడ్పడుతున్నారని అన్నారు.