దాడి చేయమని చెప్పింది విజయసాయి రెడ్డే: కాకాని ఆరోపణలపై సోమిరెడ్డి
వైసీపీ అధినేత జగన్ 11కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని గుర్తుచేసిన సోమిరెడ్డి.. ఈడీ ఆయన ఆస్తులను జప్తు చేసుకుంటూ పోతుందన్నారు.
నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య మాటల యుద్దం రోజురోజుకు ముదురుతోంది. తనపై కాకాని చేస్తోన్న ఆరోపణల పట్ల సోమిరెడ్డి మరోసారి స్పందించారు.
కాకాని గోవర్దన్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. గోవర్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. ఇదే విషయంపై సోమవారం నాడు సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాకాని గోవర్దన్ రెడ్డి ఆరోపణలను ఎద్దేవా చేస్తూ.. ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చిన సలహా మేరకే గోవర్దన్ రెడ్డి ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కాకాని గోవర్దన్ రెడ్డి తనవద్ద ఉన్న తప్పుడు పత్రాలు చూపించారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
తప్పుడు పత్రాలతో తనపై దాడి చేయాల్సిందిగా విజయసాయిరెడ్డి కాకానికి సూచించారని సోమిరెడ్డి పేర్కొనడం గమనార్హం. సోమిరెడ్డిపై దాడి చేస్తే.. కేసు తేలేసరికి ఎలాగు నాలుగైదేళ్లు పడుతుందని, ఆలోగా సోమిరెడ్డి పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందని విజయసాయి రెడ్డి కాకానితో చెప్పినట్టు సోమిరెడ్డి ఆరోపించారు.
వైసీపీ అధినేత జగన్ 11కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని గుర్తుచేసిన సోమిరెడ్డి.. ఈడీ ఆయన ఆస్తులను జప్తు చేసుకుంటూ పోతుందన్నారు. కాకాని లాంటి వ్యక్తులను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై కుట్రలు పన్నడం మంచి పద్దతి కాదని సోమిరెడ్డి సూచించారు.
ఇలాంటి కుట్రలు ఇకనైనా పక్కనబెట్టి నిజాయితీతో కూడా రాజకీయాలు చేయాలని హితవు పలికారు. తనపై తప్పుడు ఆరోపణల పత్రాలను తయారుచేసినవారిని పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు.