తప్పుకొని, నచ్చిన ఎమ్మెల్యేకివ్వు: జగన్కి సోమిరెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం మండిపడ్డారు. అదే సమయంలో ఆయనకు ఓ సూచన చేశారు! పార్టీ అధ్యక్ష పదవి నుంచి జగన్ తప్పుకోవడం మేలన్నారు. జగన్లో నైతిక విలువలు ఏమైనా మిగిలి ఉంటే అధ్యక్ష పదవిని నచ్చిన ఎమ్మెల్యేకి అప్పగించాలన్నారు.
జగన్కు అధ్యక్షుడిగా ఉండే అర్హత ఏమాత్రం లేదన్నారు. నెలకు 11 సార్లు కోర్టుకు వెళ్లే వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా సమర్థంగా పని చేస్తారా అని ప్రశ్నించారు. ఆయన ప్రజలకు ఏం న్యాయం చేస్తారన్నారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడు అంటే ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నారు.
జగన్ కేసులో ఎన్నో వేల కోట్ల రూపాయలు అక్రమార్జనకు గురైనట్టు సీబీఐ పేర్కొందని, పదహారు నెలలు జైల్లో ఉన్నాడన్నారు. జగన్ పైన అక్రమార్జన కేసు, అవినీతి కేసు ఇలా పలు కేసులు ఉన్నాయన్నారు. సీబీఐ ఇటీవలే 11వ ఛార్జీషీట్ దాఖలు చేసిందన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీ కూడా జగన్ పార్టీని విలీనం చేసుకోదని, కనీసం దగ్గరకు కూడా రానీయదన్నారు.
చంద్రబాబు అబద్దాలాడి గెలిచారు: జగన్
ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న వైయస్ జగన్ మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబుకు లేనిది, తమకు ఉన్నది దేవుడి దయ అని వ్యాఖ్యానించారు. బాబులా అడ్డగోలు మాటలు చెప్పి ఉంటే మన పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం చంద్రబాబు ఎన్నో అబద్ధాలు ఆడారన్నారు. అయినా టీడీపీ, మన పార్టీకి ఓట్ల తేడా ఐదు లక్షలే అన్నారు.