టిడిపిపై వీర్రాజు ఆసక్తికరం, 'సాక్షి', సొంత ఎమ్మెల్యేలపై వైసిపి నేత సంచలనం
విజయవాడ: తాము తెలుగుదేశం పార్టీని విమర్శించడం లేదని, వాస్తవాలు చెబుతున్నామని బీజేపీ నేత సోము వీర్రాజు సోమవారం నాడు అన్నారు. తమ అంతరంగాన్ని టిడిపి నేతలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పారు.
తాము ఎవరినీ విమర్శించడం లేదని, ప్రజలకు వాస్తవాలు చెబుతున్నామని తెలిపారు. అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని తాము భావించడం లేదని స్పష్టం చేశారు. ఏపీని అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలకు కట్టుబడటి ఉన్నామని చెప్పారు. హోదాతో ఏడువేల కోట్ల రూపాయలే వస్తాయని, కానీ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ వస్తే రూ.42వేల కోట్లు వస్తాయని సోము వీర్రాజు చెప్పడం గమనార్హం.
సాక్షి పత్రిక, వైసిపి ఎమ్మెల్యేలపై పార్టీ నేత ఆగ్రహం
సాక్షి దినపత్రిక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై గుంటూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత సంజీవ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.2 కోట్లు ఇవ్వాలని తనను బ్లాక్ మెయిల్ చేస్తూ సాక్షిలో కథనాలు రాస్తున్నారని ఆరోపించారు.
అమరావతిలోని సదావర్తివారి సత్రం భూములను వేలంలో రూ.25 కోట్లకు తాను దక్కించుకున్నానని, అప్పటి నుంచి తనను రెండు కోట్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారని ఆరోపించారు. అందుకు తాను అంగీకరించకపోవడంతో, తనకు టీడీపీ నేతలకు సంబంధాలు ఉన్నట్లు ఆ పత్రికలో కథనాలు రాశారన్నారు.
వారం పదిరోజుల నుంచి ఫోన్ చేస్తూ డబ్బులు అడుగుతున్నారని, సదావర్తి వారి సత్రం భూముల విషయంలో సీఎం చంద్రబాబుకు, కుమారుడు లోకేశ్కు, టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు నలుగురు, మీడియా వాళ్లు ఇద్దరు హైలెవెల్లో తనను టార్గెట్ చేసి చేశారని ఆరోపించారు.