కేవీపీ ఎఫెక్ట్: ఆనంద్, రేణుకల నిలదీత, హామీ ఇవ్వని కురియన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు మెంబర్ బిల్లు అంశం సోమవారం నాడు రాజ్యసభలో వేడి రాజేసింది. శుక్రవారం నాడు హఠాత్తుగా కుట్రతో బీజేపీ సభను వాయిదా వేసిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు.
ఈ అంశంపై రాజ్యసభ చైర్మన్ కురియన్ను కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఆనంద్ శర్మ నిలదీశారు. కేవీపీ ప్రత్యేక హోదా బిల్లు చర్చకు ఎందుకు రాలేదని ఆయన కప్రశ్నించారు. అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మండిపడ్డారు. బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా వాయిదా వేసిందన్నారు. సభ్యుడి హక్కును కాలరాసిందన్నారు.
ఏఏపీ లోకసభ సభ్యుడు పార్లమెంటును వీడియో తీయడం రాజ్యసభ పరిధిలోకి రాదని, దానిని బీజేపీ రాద్దాంతం చేసిందని జైరాం రమేష్ అన్నారు. రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీ ప్రజల హక్కును ఈ ప్రభుత్వం కాలరాసిందన్నారు. దీనికి కురియన్ స్పందిస్తూ... సభ ఆర్డర్లో లేకపోవడం వల్ల శుక్రవారం నాడు రాజ్యసభను వాయిదా వేశామని చెప్పారు.
అయితే, వచ్చే శుక్రవారం నాడు కేవీపీ ప్రయివేటు మెంబర్ బిల్లు పైన చర్చకు హామీ ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం వచ్చే శుక్రవారం కాకుండా, ఆగస్టు 5వ తేదీన చేపడతామని కురియన్ చెప్పారు. వచ్చే శుక్రవారం హామీ ఇవ్వలేమన్నారు.
రాజ్యసభ
కేవీపీ బిల్లు నేపథ్యంలో శుక్రవారం ఉదయం తొలిసారి రాజ్యసభ వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లు పైన చర్చ పెట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాజ్యసభ
వారిని చైర్మన్ కురియన్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బిల్లు పైన ఎట్టి పరిస్థితుల్లోను చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.
రాజ్యసభ
లెఫ్ట్ పార్టీ నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ... బీజేపీ సభ్యుడి హక్కును కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ కూడా బిల్లుపై చర్చకు పట్టుబట్టారు.
రాజ్యసభ
రాజ్యసభ చైర్మన్ ఎంత చెప్పినా విపక్షాలు వినలేదు. మరోవైపు, బీజేపీ సభ్యులు.. పార్లమెంటులో వీడియో తీసిన ఏఏపీ సభ్యుడి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యవహారం తేల్చాలని నినాదాలు చేశారు. పోడియం వద్దకు దూసుకు వచ్చారు. దీంతో, సభలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.