కెవిపి అవమానించారు, జగన్ ఏమంటావ్!: 'వైఎస్'పై కోడెల, 'శ్రీమంతుడు'కు 'జబర్దస్త్' కౌంటర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ మూడో రోజైన బుధవారం కొనసాగుతోంది. అసెంబ్లీ లాంజ్లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో తీసి వేయడం పైన ఉదయం వైసిపి ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పీకర్ స్పందించారు.
అసెంబ్లీ లాంజ్లో సభాపతుల ఫోటోలు మాత్రమే ఉంటాయని, లాంజ్లో ఇతరుల ఫోటోలు ఉండవని సభాపతి కోడెల శివప్రసాద రావు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కమిటీ హాలులో ఉంటాయని చెప్పారు. విభజనలో భాగంగా కమిటీ హాలు తెలంగాణకు వెళ్లిందని చెప్పారు.
వైయస్ ఫోటో పెట్టినప్పుడు నాడు ఆ సంప్రదాయం పాటించలేదన్నారు. అసెంబ్లీ, జనరల్ పర్సస్ కమిటీ అనుమతి లేకుండా ఎవరి ఫోటోలు పెట్టవద్దన్నారు.
వైయస్ ఫోటో తొలగింపుపై రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు తనకు లేఖ రాశారని చెప్పారు. సభను కించపరిచేలా ఆయన లేఖ రాశారన్నారు. ఎంపీ కెవిపి లేఖను మీరు సమర్థిస్తారా అని కోడెల వైసిపి సభ్యులను ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో 30 మంది విద్యార్థుల ఆత్మహత్యలు
అంతకుముందు రిషికేశఅవరి ఆత్మహత్య ఘటన పైన ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అనిత మాట్లాడారు. రిషికేశ్వరి ఆత్మహత్యను వైసిపి రాజకీయం చేస్తోందన్నారు. రిషికేశ్వరి ఆత్మహత్యను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై అర్థంపర్థం లేని విమర్శలు సరికాదన్నారు.
యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని తెచ్చింది తెలుగుదేశం పార్టీయే అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 30 మంది విద్యార్థులు ర్యాగింగ్ కారణంగా చనిపోయారని చెప్పారు. కుల రాజకీయాలకు నాంది పలికింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. విజయవాడలో ఆయేషా కేసు ఇప్పటికీ నలిగిపోతోందన్నారు.
'శ్రీమంతుడు'కు 'జబర్దస్త్' కౌంటర్
అసెంబ్లీలో మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం, ఈటీవీ సూపర్ హిట్ ప్రోగ్రాం జబర్దస్త్లు సభ్యుల మాటల సందర్భంలో వచ్చాయి.
రిషికేశ్వరి ఆత్మహత్య విషయమై రోజా మాట్లాడుతూ.. శ్రీమంతుడు సినిమా ప్రస్తావన తెచ్చారు. దీనికి టిడిపి కౌంటర్ ఇచ్చింది. రోజా వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వడానికే ఇబ్బందిగా ఉందని, రోజా కనిపిస్తున్న జబర్దస్త్ కార్యక్రమాన్ని టిడిపి ప్రస్తావించింది. జబర్దస్త్ ప్రొగ్రాం కోసం రోజా పరుగులు పెడుతున్న తీరును ప్రస్తావించారు.