మంత్రి అచ్చెన్నాయుడు మైక్ కట్, ఎక్కడైనా సవాల్: జగన్కు కాల్వ
హైదరాబాద్: శాసన సభలో కరవు పైన చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మైక్ను సభాపతి కోడెల శివప్రసాద రావు కట్ చేశారు. గురువారం సభలో కరవు పైన చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
చర్చలో భాగంగా జగన్ మాట్లాడుతూ... పట్టిసీమ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. దీనిని అధికార టిడిపి సభ్యులు అడ్డుకున్నారు. స్పీకర్ కోడెల కల్పించుకుని... చర్చను కరవుకు మాత్రమే పరిమితం చేయాలని, మరే ఇతర అంశాన్నీ ప్రస్తావించొద్దన్నారు.
ఈ సమయంలో అచ్చెన్నాయుడు మైక్ కావాలని అడిగారు. సభాపతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు వెంటనే.. వైయస్ చనిపోయిన తర్వాత వివిధ కారణాలతో మరణించిన వారిని అందరినీ, వైయస్ మృతితో మనస్తాపం చెంది మరణించారని చెబుతూ, ఆరేళ్లుగా ఓదార్పు యాత్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
అచ్చెన్నాయుడు విమర్శలు చేస్తుండగా... వ్యక్తిగత విమర్శల నేపథ్యంలో కోడెల మైక్ కట్ చేశారు. సాధారణంగా అసెంబ్లీలో మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేయడం అరుదుగా జరుగుతుంది.
పోలవరం పైన మాట్లాడే నైతిక హక్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసిపి చూస్తోందన్నారు.
జగన్కు కాల్వ సవాల్
కాల్వ శ్రీనివాసులు వైయస్ జగన్కు శాసన సభలో గురువారం సవాల్ చేశారు. ఏ ప్రాజెక్టులోనైనా అవినీతి పైన తాను చర్చకు సిద్ధమని, తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. సభలోనైనా, బయట అయినా ఏ అంశం పైన అయినా తాను చర్చకు సిద్ధమన్నారు. చర్చను పక్కదారి పట్టించడం సబబు కాదన్నారు. ఏపీ సహా 14 రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయన్నారు.