ఎపికి ప్రత్యేక హోదా: వ్యూహాత్మకంగా చంద్రబాబు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తానొవ్వక, బిజెపిని నొప్పించక కాగల కార్యం ఇతరుల ద్వారా సాధించే వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారని అంటున్నారు. తెలుగు సినీ నటుడు శివాజీ ఆమరణ నిరాహార దీక్ష చేయడం, ఢిల్లీలో కొంత మంది ప్రదర్శన నిర్వహించడం ఆయనకు కలిసి వచ్చినట్లు చెబుతున్నారు.
ప్రత్యేక హోదా కోసం ఎవరు ఆందోళన చేసిన తన మద్దతు ఉంటుందని చంద్రబాబు అసలు విషయం చెప్పారు. కేంద్రం ఇప్పటికే కొన్ని విషయాల్లో చొరవ తీసుకుందని, కేంద్రం సహరిస్తుందని, అయినా తాము ఒత్తిడి తెస్తున్నామని ఆయన చెప్పారు. ఈ మాటలను బట్టి ఆయన బిజెపితో స్నేహం చెడకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది.
బిజెపిపై గానీ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై గానీ దూకుడుగా వెళ్లే పరిస్తితిలో ఆయన లేరు. కానీ, కేంద్రం నుంచి తాను సాధించదలుచుకున్నవాటి విషయంలో మాత్రం రాజీ పడినట్లు కనిపించడం లేదు. శివాజీ ఆమరణ నిరాహార దీక్ష వంటివి తనకు లాభిస్తాయని ఆయన భావిస్తూ ఉండవచ్చు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కూడా ఒత్తిడి పెరుగుతుందనే విషయం చంద్రబాబుకు తెలియంది కాదు.
విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన వైఖరిని వెల్లడించారు. అయితే, మరింత దూకుడుగా ఆయన ముందుకు రావడానికి తగిన పరిస్థితులు వస్తాయని ఆయన భావిస్తూ ఉండవచ్చు. పవన్ కళ్యాణ్ ముందుకు రావాలని, పవన్ కళ్యాణ్ వస్తే ఫలితం వస్తుందని శివాజీ పదే పదే అంటూ వచ్చారు. ఆ రకంగా ఒత్తిడి పెరిగి పవన్ కళ్యాణ్ ముందుకు వస్తే కేంద్ర ప్రభుత్వం కాస్తా కదులుతుందని కూడా చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు.
వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రత్యేక హోదా విషయంలో పెద్దగా కదలకపోవడం కూడా చంద్రబాబుకు వెసులుబాటు కల్పించే విషయమే. కారణం ఏమిటో తెలియదు గానీ జగన్ ప్రత్యేక హోదా విషయంలో బిజెపిపై గానీ, చంద్రబాబుపై గానీ పెద్దగా ఒత్తిడి తెస్తున్న సూచనలు కనిపించడం లేదు.
రాజకీయంగా తనకు లాభించే విషయమే అయినా జగన్ దూకుడుగా ముందుకు రావడం లేదు. వామపక్షాలు మాత్రం చంద్రబాబు మీద విరుచుకుపడుతున్నాయి. అయితే, అది అంతగా చంద్రబాబును చిక్కుల్లో పడేసే విషయం కాదు. తన కన్నా ఎక్కువగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా విషయంలో విమర్శలకు గురి కావడం కూడా చంద్రబాబుకు ఊరట కలిగించే విషయమే.
ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనే ఓ స్థిరాభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లే కనిపిస్తున్నారు. కానీ, ఆ స్థానంలో భారీ ప్యాకేజీ ప్రకటించే వైపు కేంద్ర ప్రభుత్వాన్ని నెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేం గానీ దానికి బదులు భారీ ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలనేది ఆయన ఉద్దేశం కూడా కావచ్చు. ఏమైనా, చంద్రబాబు వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.