ప్రత్యేక హోదాపై బాబు సంయమనం: టిడిపిXబిజెపి, పోరు తప్పదా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య గొడవగా మారుతోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేతలు.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులను తప్పిస్తే కిందిస్థాయి నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. అందులోను లోటు బడ్జెట్లో ఉన్నందున ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో తాడోపేడో కాకుండా.. సున్నితంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాలని చంద్రబాబు, ఇతర కేంద్రమంత్రులు భావిస్తున్నారు. బిజెపి కూడా ఒకింత సంయమనం పాటిస్తోందని చెప్పవచ్చు.
అయితే, కొంతమంది నేతలు మాత్రం మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇప్పటికే ఏపీ లోటు బడ్జెట్లో ఉన్నందున సన్నిహితంతో నిధులు, ఆ తర్వాత ప్రత్యేక హోదా రాబట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
అయితే, కేంద్రం సహకరించడం లేదని కొందరు టిడిపి నేతలు చెబుతున్నారు. దీని పైన బిజెపి నేత సోము వీర్రాజు మంగళవారం మండిపడ్డారు. టిడిపి నేతలు కేవలం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని, కేంద్రం చేసిన ఇతర వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
అంతేకాదు, రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నాయని, వీటి పైన తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. మిత్రపక్షంలో ఉండి బిజెపి నేత సోము వీర్రాజు ధరల పెరుగుదల, ఇతర సమస్యల పైన పోరాడుతామని చెప్పడం చర్చనీయాంశమైంది.
సోము వీర్రాజు వ్యాఖ్యల పైన మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం నాడు స్పందించారు. తమ ప్రభుత్వం పైన ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. అంతకుముందు మాజీకేంద్రమంత్రి పురంధేశ్వరి కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ... కేంద్రం వల్లే ఏపీకి 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పారు.
సోము వీర్రాజు వ్యాఖ్యల పైన కొందరు టిడిపి నాయకులు అసంతృప్తికి గురయ్యారని తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలను బిజెపి దృష్టికి తీసుకు వెళ్లాలని కూడా యోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే, పట్టించుకోవాల్సిన అవసరం లేదనే వారు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ప్రత్యేక హోదా పరిణామానుల టిడిపి, బిజెపిల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.