పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే ఖాయం, జగన్ దీక్ష చేసినా ఫలితం: హీరో శివాజీ
ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని సినీనటుడు శివాజీ అన్నారు. కొందరు మూర్ఖులు ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదంటున్నారని, కొందరు బీజేపీ నేతల వల్లే ప్రత్యేక హోదా నినాదం దారి తప్పుతుందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు వారి స్థాయిలో పోరాటం చేస్తున్నారని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తోపాటు ఎవరు దీక్షలు చేసినా ఫలితం ఉంటుందని శివాజీ అభిప్రాయపడ్డారు. ఏలూరులో ప్రత్యేక హోదా సాధన సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సినీనటుడు శివాజీతోపాటు ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, కారెం శివాజీలు పాల్గొన్నారు.
మురళీమోహన్ ఇల్లు ముట్టడి
ప్రత్యేక హోదా కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ఇంటిని ముట్టడించారు. ఆయన ఇంటి ఎదురుగా కాసేపు ధర్నా చేశారు. అనంతరం రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం విడిచిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ తన అనుచరులతో వచ్చి రామకృష్ణకు మద్దతు ప్రకటించారు.
చంద్రబాబు తలుచుకుంటే...
ముఖ్యమంత్రి చంద్రబాబు తలుచుకుంటే గంటలో ప్రత్యేక హోదా వస్తుందని రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని చాటుదామని ఆయన పిలుపు నిచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకుంటే ‘ప్రజా బంద్‘ చేపడతామని హెచ్చరించారు. చంద్రబాబు ఇప్పటికైనా అఖిలపక్షాన్ని వెంటబెట్టుకుని ప్రధానిని కలిస్తే గంటలోనే ప్రత్యేక హో దా వస్తుందన్నారు.
దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు
ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. అవసరమైతే ఎంసీఐతో చర్చించి కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని ఆయన బుధవారంనాడు అన్నారు.
కన్వీనర్ కోటా కింద సీటు తీసుకొని వదిలివేస్తే విద్యార్థుల సర్టిఫికెట్లను హోల్డ్లో పెడతామని మంత్రి ప్రకటించారు. విద్యార్థులను డిబార్ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి వివరించారు.