మారుతున్న రాజకీయం: బాబుని కార్నర్ చేసే జగన్ దీక్షకు బిజెపి మద్దతు?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో 'ప్రత్యేక హోదా' రాజకీయం వేడెక్కుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రులు చెప్పడం, తెలుగుదేశం పార్టీ నేతలు దుమ్మెత్తి పోయడం, దీనికి బీజేపీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఏపీలో రాజకీయాలు మారుతున్నాయని ప్రస్తుత ప్రత్యేక హోదా అంశం ద్వారా కూడా తేటతెల్లమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్.. బీజేపీ వైపు చూస్తున్నారని, బీజేపీ టిడిపిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.
తాజాగా, ప్రత్యేక హోదా అంశం ద్వారా ఆ వాదనలు నిజం అయ్యేలా కనిపించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. టిడిపి నేతలు చెబుతున్నట్లుగా.. జగన్ మాత్రమే బిజెపికి దగ్గరయ్యేందుకు చూడటం లేదని, కమలం పార్టీ కూడా బాబును వదిలించుకొని పక్కచూపు చూస్తోందంటున్నారు.
బిజెపి నేత, మంత్రి మాణిక్యాల రావు వైసిపి అధినేత జగన్ దీక్షను స్వాగతించడం, హోదా విషయంలో పార్టీ సీనియర్లకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేయడం చూస్తుంటే.. ఏపీలో రాజకీయాలు మారేందుకు అడుగులు పడుతున్నాయని అంటున్నారు.
అది జగన్ - బిజెపి ఒక్కటి కావడం కావొచ్చు, టిడిపి - బిజెపి విడిపోవడం కావొచ్చు. మరేదైనా కావొచ్చని చెబుతున్నారు. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల పైన జగన్ దీక్షకు సిద్దమైన విషయం తెలిసిందే.
ఇప్పటికే తెలంగాణలో వైసిపి ఖాళీ అయింది. దీంతో తెలంగాణపై జగన్ ఫైట్ చేసినా ఆయనకు వచ్చే ఇబ్బంది లేదు. పైగా, ఏపీలో క్రెడిట్ దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఆయన దీక్షకు సిద్ధమయ్యారు. మరోవైపు టిడిపికి ఇంకా తెలంగాణలో బలం ఉంది.
తెలంగాణ ప్రాజెక్టుల పైన చంద్రబాబు కూడా విమర్శలు చేస్తున్నప్పటికీ.. గట్టిగా నిలదీయడం లేదనేది జగన్ వాదన. తెలంగాణ ప్రాజెక్టుల పేరుతో జగన్ చేస్తున్న దీక్ష.. ముఖ్యంగా చంద్రబాబును కార్నర్ చేయడమే. అలాంటి దీక్షను మంత్రి మాణిక్యాల రావు స్వాగతించారు.
పాలమూరు ప్రాజెక్టు పైన జగన్ దీక్షను తాము స్వాగతిస్తున్నామని, ఆయన దీక్ష మంచిదేనని మాణిక్యాల రావు చెప్పడం గమనార్హం.
అదే సమయంలో ప్రత్యేక హోదా రాదని తెలిశాక... నిన్నటి వరకు బిజెపిపై దుమ్మెత్తిపోసిన టిడిపి నేతలకు చంద్రబాబు సూచన చేశారు. బిజెపిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని సూచించారు. బిజెపిని టార్గెట్ చేస్తే మొదటికే మోసం వస్తుందని చంద్రబాబు తగ్గారని అంటున్నారు.
చంద్రబాబును కార్నర్ చేసే దీక్షకు బిజెపి నేత మద్దతు పలకడం, ప్రత్యేక హోదా పైన విపక్షాలన్ని టిడిపి - బిజెపిని టార్గెట్ చేస్తుంటే, చంద్రబాబు మాత్రం... సీనియర్ నేతలకు కమలం పార్టీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని చెప్పడం చర్చకు దారి తీసింది.