ప్రత్యేక హోదా: పవన్ కళ్యాణ్ కోసం టిడిపి, జగన్పై రాహుల్ ఎఫెక్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రత్యేక హోదాను సాధించే విషయంపై రాజకీయ పార్టీలు నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నాయి. ప్రత్యేక హోదా సాధించడం విషయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల వైఫల్యాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. వారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారికి ప్రశ్నాస్త్రాలు సంధించారు. దీంతో టిడిపి పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం అన్నట్లుగా పార్లమెంటులో పోరాటం చేసేందుకు సిద్ధపడిందని అంటున్నారు. అయితే, వారి తీరుపై ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డే పెదవి విరిచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జేసి దివాకర్ రెడ్డి తీవ్ర మైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు చేసే ధర్నాలన్నీ కంటితుడుపు చర్యలని అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల నోర్లు మూయించేందుకే ప్రత్యేక హోదా కోసం ఈ ధర్నా అని వ్యాఖ్యానించారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయనుకోవడం లేదన్నారు.
జెసి దివాకర్ రెడ్డి మాటను ధ్రువీకరిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషమయై కేంద్రమంత్రు సుజనా చౌదరి ట్విస్ట్ ఇచ్చారు. లోకసభ జరిగితేనే కదా, మనం ప్రత్యేక హోదా, నిధుల గురించి కేంద్రాన్ని అడగడానికి వీలుంటుందని అన్నారు. పార్లమెంటును స్తంభింప చేయడం మంచిది కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన కేంద్రంతో తాము పలుమార్లు సంప్రదింపులు జరిపామని చెప్పారు. సభను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పదేపదే అడ్డుకుంటున్నారన్నారు. ఆలస్యం అయితే అయింది, కానీ ప్రత్యేక హోదా, నిధులు సాధిస్తామని చెప్పారు. కేంద్రంలో మేము, ఏపీలో బిజెపి ప్రభుత్వంలో ఉందని, తామిద్దరం కలిసి నడుస్తున్నామని ఆయన అన్నారు. హోదా పైన కేంద్రం సానుకూలంగా ఉందన్నారు.
కాగా, ఇటీవల అనంతపురం జిల్లాలో పర్యటించిన ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేక హోదా సాధన విషయంలో నిలదీశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు, జగన్లు ఇప్పటికైనా హోదా గురించి మాట్లాడాలని ప్రశ్నించారు.
ఈ స్థితిలో రాహుల్ గాంధీపై జగన్ విరుచుకుపడ్డారు. దాంతో ఆగకుండా ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం సాగిస్తామని చెప్పారు. ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు. కేంద్రం, చంద్రబాబు దిగి వచ్చే వరకు ప్రత్యేక హోదాపై తమ పోరాటం సాగుతుదని చెప్పారు. రాహుల్ గాంధీ నిలదీయడం వల్లనే ఆయన తాము పోరాటం చేస్తామనే విషయాన్ని జగన్ ప్రకటించారని అంటున్నారు.
అయితే, రాహుల్, జగన్ల అనంతపురం జిల్లా పర్యటనకు టిడిపి మరో ట్విస్ట్ ఇచ్చింది. జగన్, రాహుల్ గాంధీ మధ్య అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా రహస్య భేటీ జరిగిందని టిడిపి నేత జూపూడి ప్రభాకర్ రావు విమర్శించారు. మొత్తం మీద, ప్రత్యేక హోదాపై పోరాటం చేసే విషయంలో అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒత్తిడిని ఎదుర్కుంటున్నట్లు అర్థమవుతోంది.